పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (49)ని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేబినెట్‌లో

Published : 20 Sep 2021 02:38 IST

మంత్రి హోదా నుంచి పదోన్నతి

ఏకగ్రీవంగా ఎన్నిక

తొలిసారి దళిత నేతకు పగ్గాలు

నేడే ప్రమాణ స్వీకారం

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (49)ని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేబినెట్‌లో ఆయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. కెప్టెన్‌ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ కొంత మల్లగుల్లాలు పడింది. ఒక దశలో సీఎల్పీ సమావేశాన్ని వాయిదా వేయాలని అనుకున్నా చివరకు ఎన్నిక పూర్తయింది. పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. చన్నీ, రావత్‌, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తదితర నేతలు గవర్నర్‌ భన్వారీలాల్‌ను కలిసి సీఎల్పీ నిర్ణయాన్ని తెలియపరిచారు. సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నూతన సీఎం ఎంపిక విషయంలో అధిష్ఠానం కొంత తర్జనభర్జనలు చేసింది. పార్టీ పరిశీలకులు ఎమ్మెల్యేలందరి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఒక దశలో తాజా మాజీ మంత్రి సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా పేరు దాదాపు ఖరారైంది. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్తూ మధ్యలో ఆగిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు చరణ్‌జిత్‌సింగ్‌ ఎంపికయ్యారు. ఇటీవల వర్గపోరులో ఆయన మరో ఇద్దరు మంత్రులతో కలిసి సిద్ధూ పక్షాన నిలిచారు. పంజాబ్‌కు తొలి దళిత సీఎం రానున్నారని సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు.

కౌన్సిలర్‌ నుంచి సీఎం వరకు..

చన్నీ (49) పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి కానున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా మూడుసార్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌గా రెండుసార్లు సేవలందించారు. 2007లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌లో చేరాక 2012, 2017 ఎమ్మెల్యేగా నెగ్గారు. చామ్‌కౌర్‌సాహిబ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక సమీకరణాల కోణంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని భావిస్తోంది. చన్నీని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అభినందించారు. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌లలో సీఎంలను మార్చడం వల్ల తగిన ఫలితం వస్తుందా అంటూ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

రాజకీయ పరిణామాలపై కెప్టెన్‌ ఆవేదన

ముఖ్యమంత్రిగా వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించిన అమరీందర్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సవివరంగా లేఖ రాశారు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. సీఎంగా తాను అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రైతు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేయలేకపోయాను. ఇది విచారకరం. కొత్త సీఎం దీన్ని సత్వరం పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. ఇకపైనా రైతులకు నా అండ ఉంటుంది. వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత’’ అని అమరీందర్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని

పంజాబ్‌ సీఎంగా వెళ్లే అవకాశం తనకు లభించినా సున్నితంగా తిరస్కరించానని, ఆ పదవిలో సిక్కు నేత ఉండాలని అధిష్ఠానానికి చెప్పానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు అంబికా సోని తెలిపారు.

అమరీందర్‌ ఆరోపణలపై ఏం చేస్తారు?: భాజపా

సిద్ధూను దేశ వ్యతిరేక శక్తిగా పేర్కొంటూ అమరీందర్‌ సింగ్‌ చేసిన తీవ్ర అభియోగాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేయాలని భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ దిల్లీలో ప్రశ్నించారు. గతంలో ఓ ఐఏఎస్‌ అధికారిణికి అభ్యంతరకర సందేశాన్ని పంపించి వివాదంలో చిక్కుకున్న చన్నీని సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని భాజపా ప్రశ్నించింది.

అమరీందర్‌! పార్టీకి నష్టం కలిగించొద్దు: గహ్లోత్‌

సీఎం పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసినా పార్టీకి నష్టం కలిగించే పనులకు దిగవద్దని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని