వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు.
వ్యవసాయ, ఉపాధి పనుల్లో కుప్పకూలుతున్న కర్షకులు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.8 డిగ్రీలు
22 జిల్లాల్లో వడగాలులు
హైదరాబాద్లో 15 శాతానికి పడిపోయిన గాలిలో తేమ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7, నిజామాబాద్ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో 46.3, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీల ఎండ కాసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి.
పడిపోతున్న తేమ శాతం
వాతావరణం చల్లగా ఉండాలంటే గాలిలో తేమ శాతం సమతూకంగా ఉండాలి. కనీసం 50 శాతం వరకు ఉంటే వేడి తీవ్రత పెద్దగా ఉండదు. రాష్ట్రంలో తేమ శాతం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో వాతావరణం పొడిబారి ఉష్ణతాపానికి దారితీస్తోంది. శనివారం రాష్ట్రంలో అత్యల్పంగా హైదరాబాద్లో 15 శాతం తేమ మాత్రమే నమోదైంది. మహబూబ్నగర్లో 19 శాతం ఉంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటితే శరీరం ఆ ఉష్ణానికి ప్రభావితమవడం ప్రారంభవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే వెట్బల్బ్ టెంపరేచర్గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో శరీరాన్ని చల్లబర్చేందుకు చెమట వస్తుందని, తగినంత ద్రవాలు తీసుకోకపోతే వడదెబ్బకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వెట్బల్బ్ టెంపరేచర్కు దాదాపు 9 డిగ్రీలపైన ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నేటి నుంచి కొంత తగ్గుముఖం
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం ఆవిరైపోతోంది. దీనివల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటోంది. ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.
నాగరత్న, డైరెక్టర్, వాతావరణశాఖ
ఎండల ధాటికి ఎంఈవో మృత్యువాత
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన ఎంఈవో బత్తుల భూమయ్య(57) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో మృతిచెందారు. ఆయన జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా.., వెల్గటూర్ మండలంలోని ముత్తునూరు, ముక్కటరావుపేట, కప్పారావుపేట గ్రామాల ప్రత్యేకాధికారిగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్గా విధులు చేపట్టారు. శుక్రవారం విధులు ముగించుకొని అస్వస్థతతో ఇంటికి చేరుకున్నారు. రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు.
బస్సులోనే విగతజీవిగా..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామానికి చెందిన రైతు దయ్యాల జంగమ్మ(58) తాను పండించిన కూరగాయలను శనివారం పాతబస్తీ లాల్ దర్వాజకు తీసుకొచ్చి ఎండలోనే విక్రయించారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సెక్కి తిరిగి గ్రామానికి వెళ్తుండగా సీటులోనే మృతిచెందారు.
నీరసించి.. కుప్పకూలి
న్యూస్టుడే బృందం: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్కు చెందిన వంక లక్ష్మి(70), భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మేకల లస్మయ్య(56), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన బొల్లబోయిన వనమాల(45), జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగెళ గొండుగూడెంకు చెందిన కొమురం సోము(58) శనివారం పొలం పనుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండకు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి చేరిన కాసేపటికే మృతిచెందారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన భూమన రాములు(71), రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నం సత్తయ్యగౌడ్(75) ఉపాధి పనులు చేస్తూ ఎండ తీవ్రతకు గురై చనిపోయారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజు(55) ఉదయం ఇటుకలను తరలించి మధ్యాహ్నం ఇంటికి చేరగానే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మహమూద్మియా(75), షాద్నగర్ పట్టణానికి చెందిన ఆకుల రాఘవేందర్(39), ములుగు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నివసిస్తున్న ఒంటరి మహిళ ఈగ ప్రమీల(69), కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి దాసరి కనుకయ్య(72), మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల దేవయ్య(70), నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ రెండో గేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి(40), సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన పెయింటర్ ధార నాగయ్య(45), కుమురం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కూలీ సయ్యద్ అజీజాబేగం(48), మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్కు చెందిన ఆవుల కనకయ్య(60), నాగర్కర్నూల్ జిల్లాల్లో కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంకు శక్రునాయక్(74) వడదెబ్బ తగిలి మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.