నింగిలోకి జపాన్‌ లూనార్‌ ల్యాండర్‌

జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతమైంది.

Updated : 08 Sep 2023 07:34 IST

ఎక్స్‌-రే టెలిస్కోప్‌ కూడా..
విజయవంతంగా తీసుకెళ్లిన హెచ్‌-2ఏ రాకెట్‌
వచ్చే ఏడాది చంద్రుడి కక్ష్యలోకి చేరనున్న ‘స్లిమ్‌’

టోక్యో: జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతమైంది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-రే టెలిస్కోప్‌(ఇమేజింగ్‌ అండ్‌ స్పెక్ట్రోస్కోపీ మిషన్‌), లూనార్‌ ల్యాండర్‌ను తీసుకొని హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ జక్సా ఈ ప్రయోగాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత ఎక్స్‌ఆర్‌ఐఎస్‌ఎం (ఎక్స్‌-రే ఇమేజింగ్‌ అండ్‌ స్పెక్ట్రోస్కోపి మిషన్‌) ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ రాకెట్‌ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్‌ చెబుతోంది.

పిన్‌ పాయింట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ

ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌) పేరుతో ఓ తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ను కూడా పంపించారు. ఈ ల్యాండర్‌.. మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే.. వచ్చే ఏడాది జనవరిలో ఈ స్లిమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగనుందని స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం ‘పిన్‌ పాయింట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ’తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌ అయ్యేట్లు దీనిని డిజైన్‌ చేశారు.

జాక్సాకు ఇస్రో అభినందన

గురువారం ఉదయం జాక్సా రూపొందించిన ఎక్స్‌రే టెలిస్కోప్‌, స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌ మూన్‌ (స్లిమ్‌) మిషన్లు విజయవంతంగా ప్రయోగించటంపై ఇస్రో అభినందించింది. చంద్రుడిపై అధ్యయనానికి మరో అంతరిక్ష సంస్థ ఉపక్రమించినందుకు అభినందనలంటూ ఇస్రో ట్విటర్‌లో పేర్కొంది. చంద్రునిపై అధ్యయనానికి బయలుదేరిన ‘స్లిమ్‌’ విజయవంతమైతే ఆ మిషన్‌తో లబ్ధి పొందే దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. జాక్సా సంస్థ సహకారంతోనే చంద్రయాన్‌ మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. చంద్రునిపై తదుపరి అధ్యయనాల కోసం ఇస్రో రూపొందిస్తున్న లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ మిషన్‌ (లూపెక్స్‌) జాక్సా సహకారంతోనే సిద్ధమవుతోంది. మొత్తంగా గురువారంతో చంద్రునిపై అధ్యయనానికి ప్రయోగాలు చేపట్టిన దేశాల సంఖ్య జపాన్‌తో కలిసి 5కు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని