Earthquake: వణికిపోతున్న తుర్కియే.. గంటల వ్యవధిలోనే మూడో భూకంపం..!

తుర్కియే (Turkey), సిరియా (Syria)ల్లోని ప్రాంతాలు వరుస ప్రకంపనలతో వణికిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే మూడుసార్లు తీవ్ర భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. వీటి ధాటికి వేల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

Updated : 06 Feb 2023 21:06 IST

అంకారా: వరుస ప్రకంపనలతో తుర్కియే(Turkey), సిరియా (Syria)ల్లోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యంత తీవ్రమైన భూకంపం (Earthquake)తో మొదలైన ఈ ప్రకంపనలు.. వరుసగా సంభవిస్తూ అక్కడి ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రకృతి విలయం ధాటికి ఇప్పటికే దాదాపు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో జనం గాయపడ్డారు. వేలాది భవంతులు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వేల మందిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే మరిన్నిసార్లు తీవ్ర భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా గడచిన 24 గంటల వ్యవధిలోనే మూడోసారి భూమి కంపించింది. ఈ సమయంలో మొత్తంగా 50 వరకు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకుటున్నట్లు భూకంప అధ్యయన కేంద్రాలు వెల్లడించాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2వేలకు పైగా నమోదైంది.  

అత్యంత తీవ్రతతో మొదలై..

తుర్కియే, సిరియా(Syria) దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. తుర్కియేలోని గజియాన్‌టెప్‌కు సమీపంలో 17.9 కి.మీ లోతులో దీని కేంద్రం నమోదైంది. దీని తర్వాత నిమిషాల వ్యవధిలో దాదాపు 20 సార్లు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. వీటి ధాటికి అక్కడ వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విషాద ఘటనలో ఇరు దేశాల్లో ఇప్పటివరకు సుమారు 2,300 మందికి పైగా మృతిచెందినట్లు గుర్తించారు. అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం చోటుచేసుకోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య వేల సంఖ్యలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుర్కియే లోనే మృతుల సంఖ్య భారీగా ఉండనుందని.. తమ దేశ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తు ఇదని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌ వెల్లడించారు.

మధ్యాహ్నం మరోసారి..

మధ్యాహ్నం 1.24 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(USGS) వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని ఎకినోజు ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. తాజా భూకంపం ధాటికి తుర్కియేతో పాటు సిరియా రాజధాని డమాస్కస్‌, లటాకియా ప్రాంతాల్లో భూమి కంపించింది.

గంటల వ్యవధిలో మూడోసారి..

ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రకంపనలు నమోదవుతూనే ఉన్నాయి. సాయంత్రానికి వందలసార్లు చిన్న ప్రకంపనలు చోటుచేసున్నాయి. సాయంత్రం 6 గంటల సమయంలో కేంద్ర తుర్కియే ప్రాంతంలో 6.0 తీవ్రతతో మరోసారి తీవ్ర భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఇలా వరసగా చోటుచేసుకుంటున్న భూకంపాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారినట్లు తెలుస్తోంది. మొత్తంగా తుర్కియే, సిరియా ప్రాంతాల్లో మహా విషాదాన్ని నింపినట్లు సమాచారం.

  • తుర్కియేలో మూడు భారీ భూకంపాలు సంభవించడంతో మృతుల సంఖ్య 1500లకు పైగా నమోదైనట్టు డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ ఒర్హాన్‌ టాటర్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు 8,533మంది గాయపడగా.. 2,834లకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇంకోవైపు, సిరియాలో మృతుల సంఖ్య 810కి పెరిగింది. 
  • భారత విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ దిల్లీలోని తుర్కియే ఎంబసీకి వెళ్లారు. అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకొని విచారం వ్యక్తంచేశారు.  తుర్కియేకు అవసరమైన వైద్య, సహాయక బృందాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
  • పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ ప్రకృతి విలయంతో సంభవించిన తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన షెహబాజ్‌.. ఈ కష్ట సమయంలో తుర్కియే ప్రజలందరికీ అన్ని రకాలుగా సాయం అందించేందుకు అండగా ఉంటామన్నారు. 
  • తుర్కియేలో సంభవించిన ప్రకృతి విలయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తుర్కియేకు అవసరమైన సహాయాన్ని అందించాలని తమ దేశ సంస్థలకు సూచించారు. అంకారాతో సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించాలని ఆదేశించినట్టు సమాచారం. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని