Singapore: తంగరాజును ఉరితీసిన సింగపూర్‌

సింగపూర్‌(Singapore)లో భారత సంతతి వ్యక్తికి బుధవారం ఉరిశిక్ష అమలైంది. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.

Updated : 26 Apr 2023 22:36 IST

సింగపూర్‌: గంజాయి అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌ (Singapore) బుధవారం ఉరిశిక్ష అమలు చేసింది. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా జరిగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఈ శిక్షపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్‌ అతడిని శిక్షించింది.

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య (Tangaraju Suppiah).. గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. ఒక కిలో గంజాయిని సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఈ కేసులో అతడికి అక్టోబర్‌ 9, 2018లో మరణశిక్ష పడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన న్యాయస్థానం.. అతడికి శిక్ష విధించింది. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.

ఇదీ చదవండి: సింగపూర్‌లో ధర్మలింగానికి ఉరిశిక్ష అమలు

ప్రమాణాలకు అనుగుణంగా తంగరాజు కేసు విచారణ జరగలేదని, ఓ అమాయకుడిని సింగపూర్ చంపబోతోందని ఇదివరకు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ శిక్షపై బ్రిటన్‌ బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. యూరోపియన్ యూనియన్‌, ఆస్ట్రేలియా ఆయనకు మద్దతుగా నిలిచాయి. కానీ బ్రాన్సన్‌ ప్రకటనను సింగపూర్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు సింగపూర్‌ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. మాదకద్రవ్యాలకు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే అతడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని