
తాజా వార్తలు
చాలా మంది నెటిజన్లు నన్ను ద్వేషిస్తున్నారు..!
ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా: అలియా భట్
ముంబయి: తనను ఉద్దేశించి చేసిన విద్వేషపూరితమైన పోస్టులు స్ఫూర్తిని ఇచ్చాయని బాలీవుడ్ కథానాయిక అలియా భట్ వెల్లడించారు. ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్ భట్ కుమార్తెగా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ‘2 స్టేట్స్’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘రాజీ’ ‘గల్లీభాయ్’ తదితర చిత్రాలతో నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పలు చిత్రాల్లో గీతాలు ఆలపించి గాయనిగానూ అలరించారు. ఇటీవల వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. ఓ దుస్తుల బ్రాండ్ను స్థాపించారు. తాజా ఇంటర్వ్యూలో అలియా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వ్యాపారం గురించి మాట్లాడారు. తనకు అధిక సంఖ్యలో విద్వేషపూరితమైన పోస్టులు వస్తుంటాయని, అవే తనలో ప్రేరణ నింపుతుంటాయని తెలిపారు. వ్యాపారవేత్తగా మారడం, సంస్థ కార్యకలాపాలు చూసుకోవడం కొత్తగా ఉందని పేర్కొన్నారు. ‘నేను ఎంతో విద్వేషాన్ని చూశాను. ఎదుటి వ్యక్తి పట్ల దయతో వ్యవహరిస్తే అది ఎంతో మార్పుకు దారి తీస్తుంది. మనమంతా ఇతరులతోపాటు ఈ భూమి పట్ల ప్రేమగా ఉండాలనే విషయం నాకు ఈ మధ్య బాగా అర్థమైంది’ అని ఆమె చెప్పారు.
సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత అలియాను నెటిజన్లు విపరీతంగా విమర్శించారు. హాని తలపెడతామని బెదిరిస్తూ కొందరు హద్దులు మీరి వ్యాఖ్యలు చేశారు. సినీ వారసులు చిత్ర పరిశ్రమలో ముందంజలో రాణిస్తున్నారని, నేపథ్యం లేని వారిని తక్కువ చేస్తున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలియాతోపాటు మిగిలిన సినీ వారసులు కూడా ఈ విమర్శలు ఎదుర్కొన్నారు.
‘సడక్ 2’తో అలియా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.