
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం
ఏపీలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణపై ఈ సాయంత్రం పంచాయతీరాజ్శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకానున్నారు. తొలి దశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏయే జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
* పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం
* ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్
* ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు
2. ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ కు సంబంధించి దాఖలైన ఏడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ధర్మాసనం.. అందులో ఐదు పిటిషన్లను తోసిపుచ్చి, రెండింటిని విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
* నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం
3. కొవిడ్ టీకాపై భయం తొలగించాలి: మోదీ
కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకొచ్చిన టీకాల సమర్థత, భద్రతపై నెలకొన్న భయాలు, అపోహలను పారద్రోలాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా టీకా తీసుకున్న లబ్ధిదారులు, వ్యాక్సిన్ వేసే సిబ్బందితో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి నుంచి టీకా అనుభవాలను తెలుసుకున్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతోంది. కరోనా పోరులో ముందున్న ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తొలి దశలో టీకాలు తీసుకుంటున్నారు. టీకా సామర్థ్యంపై డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు చెబితేనే ప్రజల్లోకి గట్టి సందేశం వెళ్తుంది. టీకాపై అపోహలను తొలగించండి’ అని మోదీ హెల్త్ వర్కర్లను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. ‘బేర్’మన్న మార్కెట్లు
బుల్ దూకుడుకు భల్లూకం అడ్డుపడింది. అమ్మకాల ఒత్తిడికి మార్కెట్ కుదేలైంది. ఫలితంగా ఈ వారాన్ని సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు పతనమవ్వగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 14,400 మార్క్ను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దిగ్గజ రంగాల షేర్లలో జరిగిన లాభాల స్వీకరణతో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ దిగజారాయి. 49,594 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 48,832 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. మే 29న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. మే 29న అందుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసింది. ఇదే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆమె ప్రారంభ ప్రసంగం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
6. దీదీకి మరో మంత్రి షాక్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో మంత్రి తన పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
7. మరింత దృఢంగా.. భారత్-అమెరికా బంధాలు
బైడెన్ రాకతో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాలకూ చైనాయే సవాళ్లు విసురుతున్నందున కలిసి పనిచేయాల్సిన అవసరం మునుపటికన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆర్థిక, మిలటరీ, సాంకేతిక రంగాల్లో చైనా ఎదుగుతున్న దృష్ట్యా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన అరుణ్ సింగ్ అన్నారు. అమెరికా అనుసరించే చైనా, ఆసియా విధానాలు ఎలా ఉంటాయో తెలిసిన తరువాతే ఇరు దేశాల సంబంధాలపై స్పష్టత వస్తుందని మరో దౌత్యవేత్త రాజీవ్ భాటియా అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
* ట్రంప్తో సంభాషణా? ఇప్పట్లో లేదు
8. తారక్ ట్రాఫిక్ జరిమానా చెల్లించిన అభిమాని
సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ యంగ్టైగర్ ఎన్టీఆర్కు ఎంతోమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తారక్ కారుకు సంబంధించిన ట్రాఫిక్ జరిమానా చెల్లించాడు. అంతేకాకుండా దానికి ప్రతిఫలంగా హీరో ముందు ఓ చిన్న వినతిని ఉంచాడు. నెహ్రూ ఔటర్ రింగురోడ్డుపై ఓవర్స్పీడ్లో కారు నడిపినందుకు గాను ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్కు రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్లైన్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
9. ఎన్పీఏల సమస్యకు ‘బ్యాడ్ బ్యాంక్’ పరిష్కారమా?
‘బ్యాడ్ బ్యాంకులపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. బ్యాడ్ ఏర్పాటుపై ప్రతిపాదనలు వస్తే స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వాటిని పూర్తిగా సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేస్తాం. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల ఏర్పాటు కోసం ఇప్పటికే ఆర్బీఐ రెగ్యులేటరీ గైడ్లైన్స్ రూపొందించింది’’ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన వ్యాఖ్యలివి. ఇంతకీ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
10. పంత్ బాగా ఆడితే నా కెరీర్ ముగిసిపోదు..
టీమ్ఇండియా యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషభ్పంత్ వికెట్ల వెనుక మెల్లిగా మెరుగవుతాడని, ఎవరూ ఒకటో తరగతిలోనే అన్నీ నేర్చుకోరని సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పంత్(89*) గబ్బా టెస్టులో భారత్ను గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతడు హీరోగా మారాడు. ఈ నేపథ్యంలోనే తుది జట్టులో సాహా స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్పందించిన సాహా.. పంత్ బాగా ఆడినంత మాత్రాన తన కెరీర్ ముగిసిపోతుందని అనుకోవట్లేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
* ఇంటికి చేరుకున్న అశ్విన్, సుందర్