బాల బోధనలో శిక్షణ
బోధన వృత్తికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై కొందరు అమితమైన ఆసక్తి చూపుతారు....
డీఎడ్ ప్రవేశానికి డీఈఈ సెట్
చిన్న వయసులోనే స్థిరమైన కెరియర్కు డీఎడ్ కోర్సు దారిచూపుతుంది. దీన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, తమిళం (ఏపీలోనే) మాధ్యమాల్లో అందిస్తున్నారు. ఇంటర్లో చదివిన గ్రూప్, పరీక్ష రాయడానికి ఎంచుకున్న మాధ్యమం ప్రకారం డీఎడ్ కోర్సును సంబంధిత భాషలో పూర్తి చేసుకోవచ్ఛు డీఈఈ సెట్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు అనుసరించి సీట్ల కేటాయింపులుంటాయి. ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో డైట్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఎయిడెడ్, మైనార్టీ, ప్రైవేటు సంస్థలు డీఎడ్ కోర్సు అందిస్తున్నాయి.
వీటిలో ఎక్కడ చేరాలన్నా డీఈఈ సెట్ రాయాల్సిందే. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు (35) సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు లభిస్తుంది. 85 శాతం సీట్లు స్థానికులతో భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు అందరూ పోటీపడవచ్ఛు సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్ ద్వారా ఉంటుంది. ప్రభుత్వ డైట్లలో వంద శాతం, మిగిలిన సంస్థల్లో 80 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటగిరీ ఎ కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు, మైనార్టీ సంస్థల్లో 20 శాతం సీట్లు కేటగిరీ బిలో భర్తీ అవుతాయి. రెండేళ్ల డీఎడ్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఒకటి నుంచి అయిదు తరగతుల విద్యార్థులకు బోధించవచ్ఛు ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల ప్రకటన వెలువడినప్పుడు సెకెండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో...
వంద మార్కుల ప్రశ్న పత్రంలో రెండు పార్టులు ఉంటాయి. పార్ట్- ఎలో 60, పార్ట్- బిలో 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
* పార్ట్- ఎలో టీచింగ్ ఆప్టిట్యూడ్ 5, జనరల్ నాలెడ్జ్ 5, ఇంగ్లిష్ 5, తెలుగు 5, ఆప్షనల్ లాంగ్వేజ్ (తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూల్లో ఏదో ఒకటి) 10, మ్యాథ్స్ 10, జనరల్ సైన్స్ 10, సోషల్ స్టడీస్ 10 ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టు, లాంగ్వేజ్ ప్రశ్నలన్నీ 6 నుంచి పదో తరగతి సిలబస్లో ఉన్న అంశాల నుంచే వస్తాయి.
* పార్ట్- బి అభ్యర్థి ఇంటర్లో చదివిన గ్రూపు, ఎంచుకున్న విభాగం బట్టి మారుతుంది. మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్/ బయాలజీ/ సోషల్ స్టడీస్లో 40 ప్రశ్నలు ఇంటర్ సిలబస్ నుంచి అడుగుతారు. మ్యాథ్స్ తీసుకున్నవారికి మొదటి ఏడాది నుంచి 20, రెండో సంవత్సరం సిలబస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఫిజికల్ సైన్స్ ఎంచుకుంటే ఫిజిక్స్ నుంచి 20, కెమిస్ట్రీ 20 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీ వారికి బోటనీ 20, జువాలజీ 20 ప్రశ్నలు ఉంటాయి. సోషల్ స్టడీస్ లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఒక్కో సబ్జెక్టు నుంచి 13 లేదా 14 ప్రశ్నలు చొప్పున మొత్తం 40 ఉంటాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి నచ్చిన మాధ్యమం ఎంచుకోవచ్చు.
అభ్యర్థి ఎంచుకున్న గ్రూపు ప్రకారం ఇంటర్ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. పరీక్షలో ఆయా సబ్జెక్టుల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సమాన ప్రాధాన్యం ఉంది. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు, మోడల్ పేపర్లను సాధన చేయాలి. ఆయా గ్రూపుల వారీ ఆర్డీసీ ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి. పార్ట్-ఎలో సబ్జెక్టు ప్రశ్నలకు హైస్కూలు 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లిష్ పుస్తకాలు చదవడం తప్పనిసరి.
సీట్ల కేటాయింపు: ఏపీలో ఇంటర్లో చదివిన గ్రూపుల వారీ డైట్లలో సీట్లు కేటాయిస్తారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఒక్కో విభాగానికి 25 శాతం చొప్పున సీట్లు లభిస్తాయి. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సీట్లకు ఎంపీసీ; బయలాజికల్ సైన్స్ సీట్లకు బైపీసీ, సోషల్ స్టడీస్ సీట్లకు సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల వారు పోటీపడవచ్చు.
తెలంగాణలో..
ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్ఛు ఇందులో మొత్తం 3 విభాగాలుంటాయి. పార్ట్- 1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు వస్తాయి. పార్ట్- 2లో తెలుగు మీడియం విద్యార్థులకు జనరల్ ఇంగ్లిష్ 10, జనరల్ తెలుగు 20 ప్రశ్నలు వస్తాయి. అదే ఇంగ్లిష్ మీడియం అయితే జనరల్ ఇంగ్లిష్ 20, జనరల్ తెలుగు 10 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్- 3లో మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్సెస్ 10, బయలాజికల్ సైన్సెస్ 10, సోషల్ స్టడీస్ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
సబ్జెక్టు, లాంగ్వేజ్ ప్రశ్నలన్నీ తెలంగాణ పదో తరగతి సిలబస్ స్థాయిలోపే ఉంటాయి. అందువల్ల 6 నుంచి 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. ఇంటర్ పాఠాలు చదవాల్సిన పనిలేదు. ఆర్జేసీ, పాలిటెక్నిక్ పాతప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి. పాత డీఈఈ సెట్ ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. పరీక్షకు మందు మీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అందుకు తగ్గట్టుగానే ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో సాధించిన స్కోరు, రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపులుంటాయి. ఇంటర్లో చదివిన గ్రూపుతో సంబంధం లేదు.
అర్హత: 50శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం. ఒకేషనల్ విద్యార్థులు అనర్హులు. సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.
ముఖ్య తేదీలు
ఆంధ్రప్రదేశ్: జూన్ 4లోగా ఫీజు చెల్లించి, జూన్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షలు: జూన్ 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు
https://apdeecet.apcfss.in/
తెలంగాణ: దరఖాస్తులు జూన్ 5 వరకు స్వీకరిస్తారు
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు
ఇవీ మెలకువలు
ఏపీ డీఈఈ సెట్
* సిలబస్ చాలా విస్తృతంగా ఉన్నందున గత పరీక్షల ప్రశ్నల సరళిని నిశితంగా పరిశీలించాలి. వెయిటేజి ఉన్న అధ్యాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రధాన విషయాలను ఆచరణాత్మక ధోరణితో అధ్యయనం చేయాలి.
* ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల సిలబస్లోని కీలకాంశాలపై దృష్టిపెట్టి చదివితే 6 నుంచి 10 తరగతుల సిలబస్లోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు పునశ్చరణ అవుతాయి. ఇంటర్ సిలబస్లో కవర్ కాని విషయాలను ప్రత్యేకంగా అభ్యసించాలి.
* తెలుగు, ఆంగ్లం వ్యాకరణాంశాలు పదో తరగతి స్థాయివి. వీటిని అవగాహనతో నేర్చుకోవాల్సివుంటుంది.
* టీచింగ్ ఆప్టిట్యూడ్, జీకే అంశాలను ప్రత్యేక శ్రద్ధతో సన్నద్ధమవ్వాలి. మార్కెట్లో పుస్తకాలు, ఇంటర్నెట్లో సమాచారం లభ్యం కాబట్టి ఆందోళన లేకుండా ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి.
* ఇంటర్లో ప్రస్తుతం ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా మిగతావి పదో తరగతి వరకూ చదివినవే. అందుకని పునశ్చరణ సులువుగా ఉంటుంది. ఏమైనా అధ్యాయాలు కఠినంగా తోస్తే ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
* చదివేటప్పుడే షార్ట్నోట్సు తయారుచేసుకుంటే రివిజన్ సులువు అవుతుంది.
* గత ప్రశ్నపత్రాలు, నమూనా పరీక్షలు సాధన చేస్తూ, తప్పులు సవరించుకోవాలి. నమూనా పరీక్షల్లో ఊహాత్మక సమాధానాలు తగ్గించాలి.
టీఎస్ డీఈఈ సెట్
* కనీస విద్యార్హత ఇంటర్ అయినప్పటికీ పరీక్ష సిలబస్ ప్రధానంగా పదోతరగతికి నిర్దేశించినదే. టీఎస్ టెన్త్ సిలబస్ను సబ్జెక్టులవారీగా పరిశీలించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా కీలక అధ్యాయాలు, భావనలు గుర్తించి ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమవ్వాలి.
* టీచింగ్ ఆప్టిట్యూడ్లో మీరు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి తరగతిలో పొందిన అనుభవాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.
* జనరల్నాలెడ్జికి సంబంధించి సమకాలీన సమస్యలు, ప్రధానంగా విద్యారంగంతో పాటు సామాజిక, రాజకీయ, క్రీడాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
* కష్టతరమైన అంశాలకూ, భావనలకూ అధిక సమయం కేటాయించుకుని పట్టు సాధించాలి.
* ఇంటర్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులపై ఇప్పటికే మీకు అవగాహన ఉంటుంది. అయినప్పటికీ పోటీ పరీక్ష దృష్ట్యా సబ్జెక్టు పరిజ్ఞానాన్ని అనువుగా మల్చుకోవాలి. టెన్త్ వరకూ చదివినవి మరోసారి సాధన చేయాలి.
* పాత ప్రశ్నపత్రాలు, నమూనా పరీక్షలు సాధన చేయాలి. దొర్లిన తప్పులు సవరించుకోవాలి.
- డా. వి. బ్రహ్మం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.