Technology: ఆర్థిక సంస్థల్లో సాంకేతికతపై ప్రామాణిక శిక్షణ

అన్ని రంగాలూ డిజిటల్‌ దిశగా దూసుకుపోతున్నాయి. బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైంది. వ్యవహారాలన్నీ సులువుగా, సజావుగా, కచ్చితత్వంతో పరిమిత వనరులతో పూర్తి కావడంలో డిజిటల్‌ టెక్నాలజీ ఎంతగానో

Updated : 01 Jun 2022 05:46 IST

బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా

అన్ని రంగాలూ డిజిటల్‌ దిశగా దూసుకుపోతున్నాయి. బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైంది. వ్యవహారాలన్నీ సులువుగా, సజావుగా, కచ్చితత్వంతో పరిమిత వనరులతో పూర్తి కావడంలో డిజిటల్‌ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు ఆయా రంగాల వారీ ప్రత్యేక నిపుణుల సేవలు తప్పనిసరి. ఆ దిశగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆలోచించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సమర్థ మానవ వనరుల కోసం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ)ని హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఇక్కడ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ) కోర్సు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది!

1996లో ఐడీఆర్‌బీటీని హైదరాబాద్‌లో మాసాబ్‌ ట్యాంకు ఎన్‌ఎండీసీ సమీపంలో ఆర్‌బీఐ నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన సాంకేతికతపై శిక్షణ అందించడంతోపాటు ఆ రంగాలకు అవసరమైన డిజిటల్‌ టెక్నాలజీపై పరిశోధనలు నిర్వహిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లాభదాయకంగా మారడం దిశగా రూపొందించిందే బ్యాంకింగ్‌ టెక్నాలజీ పీజీ డిప్లొమా. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆరో బ్యాచ్‌లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. జులై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఈ కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై మేటి శిక్షణను సొంతం చేసుకోవచ్చు. అలాగే కోర్సు చివరలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాన్నీ అందుకోవచ్చు.

ఏడాది వ్యవధితో...

కోర్సును ఫుల్‌ టైం విధానంలో ఏడాది వ్యవధితో నడుపుతున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలుపుతారు. మారుతున్న సాంకేతికత బ్యాంకింగ్‌ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. వీరికి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా రూపొందిస్తారు. భారతీయ బ్యాంకింగ్‌, ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా అవసరమైన తర్ఫీదు అందిస్తారు. ఈ రంగాల్లో తాజా సాంకేతిక మార్పులను అనువర్తిస్తారు. నేర్చుకున్న టెక్నాలజీని పలు విధాలుగా ఉపయోగించి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఉత్పాదకత పెరిగేలా శిక్షణ అందిస్తారు. కోర్సులో ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు.


ఏం నేర్చుకుంటారు?

కోర్సు ఫీజు వసతితో కలుపుకుని రూ.5 లక్షలు. పన్నులు అదనం. కోర్సు మొత్తం 5 టర్మ్‌ల్లో ఉంటుంది. ఇందులో భాగంగా లెక్చర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్‌ సెషన్లు ఉంటాయి. సీనియర్‌ బ్యాంకర్లు, సంస్థకు చెందిన రిసెర్చ్‌ సెంటర్లు ఇందులో భాగమవుతాయి.

క్రిప్టోగ్రఫీ, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఐవోటీ, బిగ్‌డేటా, ఎనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ బ్యాంకింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, పేమెంట్‌ సిస్టమ్‌...మొదలైన వాటిపై విస్తృత స్థాయిలో తర్ఫీదు అందిస్తారు. చివరి టర్మ్‌ ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో దీన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పూర్తిచేయాలి. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు. కోర్సు చివరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్‌, ఐడీబీఐ, కరూర్‌ వైశ్య, ఫెడరల్‌, కొటాక్‌, సౌత్‌ ఇండియా, ఎన్‌పీసీఐ.. తదితర సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి.

మొత్తం సీట్లు: 40. వీటిలో 10 స్పాన్సర్డ్‌. వీటిని బ్యాంకులు, ఆర్థిక  సంస్థలకు కేటాయించారు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్ట్‌లో ఫస్ట్‌ క్లాస్‌తో పీజీ. అయితే వీరు 10+2+4 విధానంలో చదివుండాలి. అలాగే గేట్‌, క్యాట్‌, జీమ్యాట్‌, జీఆర్‌ఈ, సీమ్యాట్‌, గ్జాట్‌, మ్యాట్‌, ఆత్మా వీటిలో ఏదో ఒక స్కోర్‌ తప్పనిసరి.
ఎంపిక: దరఖాస్తులను స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సులోకి తీసుకుంటారు. దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7 గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు:
తేదీలు తర్వాత ప్రకటిస్తారు. https://www.idrbt.ac.in/index.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని