ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

‘ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నాసరే ఉద్యోగులు, పింఛనుదార్లకు ఎలాంటి మేలు జరగలేదు. మూడేళ్లుగా పీఆర్సీ నివేదిక బయటపెట్టడంలేదు. అధికారం చేపట్టిన వారంలోనే

Published : 27 Nov 2021 02:56 IST

పీఆర్సీ నివేదిక ఎందుకు బయటపెట్టరు?

వారంలో సీపీఎస్‌ రద్దు ఏమైంది?

మండలిలో నిలదీసిన ఎమ్మెల్సీలు

ఈనాడు, అమరావతి: ‘ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నాసరే ఉద్యోగులు, పింఛనుదార్లకు ఎలాంటి మేలు జరగలేదు. మూడేళ్లుగా పీఆర్సీ నివేదిక బయటపెట్టడంలేదు. అధికారం చేపట్టిన వారంలోనే సీపీఎస్‌ రద్దని ఇచ్చిన హామీ ఏమైంది? డీఏల బకాయిలు అలాగే ఉన్నాయి. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, నిరాశతో... మనోవేదనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలకు తేదీలు ప్రకటించి అమలు చేస్తున్నట్లే... పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, డీఏలు తదితరాలకు కచ్చితమైన తేదీలు ప్రకటించాలి’ అని ఎమ్మెల్సీలు నిలదీశారు. మండలిలో శుక్రవారం ఉద్యోగుల సంక్షేమంపై లఘు చర్చ సందర్భంగా వారు మాట్లాడారు...

‘పీఆర్సీ నివేదిక బయటపెట్టకపోవడం దురదృష్టకరం. ఒప్పంద పారామెడికల్‌ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఉద్యోగుల జేబులో రూ.500 మించి ఉండకూడదనే పాతనిబంధన తొలగించాలి’ అని భాజపాపక్ష నేత మాధవ్‌ డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, పూటగడవని స్థితిలో ఉండే 90% మంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చినట్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ‘ఈ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇంతలో కొవిడ్‌తో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. పీఆర్సీపై వివిధ సమావేశాలు జరిగాయి. నివేదిక ప్రస్తుతం కార్యదర్శుల కమిటీ పరిశీలనలో ఉంది. సీపీఎస్‌పై మంత్రుల కమిటీ, వర్కింగ్‌ కమిటీ వేశాం. ఈ సిఫార్సులను విశ్లేషించడానికి యాక్చువరీ కేఏ పండిట్‌ సలహా తీసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 పోస్టుల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేశాం. వైద్యశాఖలో మరో 11 వేల పోస్టుల నియామకం చేపడుతున్నాం. ఆప్కాస్‌తో 98 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతోంది. కొవిడ్‌తో ఇబ్బందులు ఉన్నప్పటికీ జీతాలు ఇచ్చాం. మోడల్‌స్కూళ్ల టీచర్ల సర్వీస్‌ నిబంధనలు రెండు,మూడు రోజుల్లో వస్తాయి’ అని మంత్రి వివరించారు. చివర్లో విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కీలక అంశాలకు పరిష్కారం తెలపకుండా మంత్రి చాకచక్యంగా సమాధానాలు చెప్పారని విమర్శించారు.

* ‘పీఆర్సీ నివేదిక బయటపెట్టకపోవడం గత 40 ఏళ్లలో ఎన్నడూలేదు. సీపీఎస్‌ రద్దు చేస్తామనే హామీని నెరవేర్చి నిజాయితీని ప్రదర్శించాలి. మూడు లక్షల మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామనే హామీ కూడా అమలుకు నోచుకోలేదు’ అని ఐ.వెంకట్రావు ప్రశ్నించారు.

* ‘ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది. పీఎఫ్‌, జీఎస్‌ఎల్‌ఐ, వైద్య బిల్లులు తదితరాలకు 12-20 నెలలు ఎదురుచూడాల్సి రావడం అన్యాయం. మోడల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లుగా సర్వీస్‌ నిబంధనలు ఇవ్వకపోవడం ఏమిటి?’ అని కత్తి నర్సింహారెడ్డి నిలదీశారు.

* ‘దిల్లీ ప్రభుత్వంలాగే సీపీఎస్‌ రద్దును ప్రకటించాలి. దీనిపై తీర్మానం చేయాలి. ఖాళీ పోస్టుల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేయాలి’ అని శ్రీనివాసులరెడ్డి కోరారు. ‘ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపడంలేదు. ఉద్యోగుల్లో అశాంతి ఉంది’ అని లక్ష్మణరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని