TDP Mahanadu: అరాచక పాలనపై సమరభేరి
‘అరాచక విధ్వంసక పాలనపై ఈ మహానాడు వేదికగా యుద్ధం మొదలయింది. జగన్ ప్రభుత్వాన్ని ఉరితీద్దాం. ఆయన్ను ఇక ఇంటికి పంపేద్దాం. ముందస్తు ఎన్నికలొచ్చినా సాగనంపేద్దాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. క్విట్ జగన్..
జగన్ను ఇంటికి పంపేద్దాం
రైతులూ ఉరేసుకోవద్దు.. ఈ ప్రభుత్వాన్ని ఉరితీద్దాం
ప్రజలూ.. మీ సమస్యల్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టండి
ప్రజలకు, ఉద్యోగులకు అండగా ఉంటా
రాష్ట్రాన్ని ఏలుతున్నది సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రభాకర్రెడ్డిలే
ఈ సభ చూశాక జగన్కు నిద్రపట్టదు
మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు
- మహానాడు ప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
‘అరాచక విధ్వంసక పాలనపై ఈ మహానాడు వేదికగా యుద్ధం మొదలయింది. జగన్ ప్రభుత్వాన్ని ఉరితీద్దాం. ఆయన్ను ఇక ఇంటికి పంపేద్దాం. ముందస్తు ఎన్నికలొచ్చినా సాగనంపేద్దాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని 5 కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. ‘మీరంతా తాడోపేడో తేల్చుకోవాలని వచ్చారు.. చైతన్యం, పట్టుదల, కసితో పోరాటంలో పాలుపంచుకోవడానికి నేను సైతం అంటూ తరలివచ్చారు.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపుదామా అన్న ఉత్సాహంతో కదలివచ్చారు.. ఈ రాష్ట్రాన్ని ఉన్మాదుల పాలన నుంచి కాపాడాలని, గాడిలో పెట్టాలని వచ్చారు’ అని చంద్రబాబు పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది వెనుకబడిన వర్గాలు కాదు- సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలేనని ఆరోపించారు. సుబ్రమణ్యం హత్య కేసులో తెదేపా పోరాటంతో ఎమ్మెల్సీ అనంత్బాబును అరెస్టు చేశారు. మరి వివేకానందరెడ్డి హత్య కేసులో భారతి మేనబావ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రిని అరెస్టు చేయగలరా? అని సవాల్ చేశారు. జగన్ అప్పులు చేసి ఆ సొమ్మంతా తన సొంత ఖజానాకు మళ్లిస్తున్నారన్నారు. ధరలు పెరిగిపోయి, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తుంటే ఊరుకుందామా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు అండగా ఉండి, వారి తరఫున పోరాడతానని ప్రకటించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఇప్పుడు కేంద్రం కాళ్లపై పడుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన హామీలను జగన్ ఏం చేశారని నిలదీశారు. రాజకీయ ఉద్దేశాలతో చేసిన జిల్లాల విభజనలోని లోపాలను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దుతానని ప్రకటించారు. మహానాడు సందర్భంగా ఒంగోలు శివారు మండువవారిపాలెంలో శనివారం నిర్వహించిన బహిరంగసభకు లక్షల సంఖ్యలో హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. సభికులంతా సీఎం సీఎం అని నినదిస్తుండగా ఉత్సాహంగా ప్రారంభమైన ఆయన ప్రసంగం.. క్రమంగా ఆగ్రహంగా మారి.. ఆవేశంగా సాగింది. ప్రభుత్వ విధానాలు, అస్తవ్యస్త నిర్ణయాలపై ఆయన సభికులను ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జన సమూహంతో క్విట్ జగన్...సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేయించారు.
శ్రీలంకలా మార్చేస్తున్నారు.. ఊరుకుందామా?
సినిమా వాళ్లనీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నారు. బాలకృష్ణ అఖండ సినిమా ఆడనివ్వకూడదని ప్రత్యేక ఆటలకు అనుమతి ఇవ్వలేదు. విడుదలై బ్రహ్మాండంగా ఆడింది. గడపగడపకు వైఎస్సార్ పార్టీ అని వెళితే ప్రజలు నిలదీస్తారని భయపడి, గడప గడపకు ప్రభుత్వం అని మార్చారు. పోలీసులను వెంట తీసుకువెళ్లి ప్రజలు నిలదీయకుండా అడ్డుకోవాలనుకున్నారు. జీవితాలను నాశనం చేసి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. రేపే మాపో రాష్ట్రం శ్రీలంకలా మారిపోయేలా ఉంది. అయినా ఊరుకుందామా? ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడను. బుల్లెట్లా దూసుకొస్తా.
సంక్షేమం ఎవరు చేశారు?
రాష్ట్రంలో సంక్షేమానికి నాంది పలికింది తెదేపా, ఎన్టీఆర్. రూ.2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, చీర, ధోవతి ఇచ్చింది ఎవరు, వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు లేకుండా చేసింది ఎవరు? సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చింది ఎవరు? విదేశీ విద్యను అందించింది మేం కాదా? మా హయాంలో సంక్షేమానికి 51 శాతం ఖర్చు చేస్తే వైకాపా 41 శాతానికి తగ్గించింది. ఆయన పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు. ఖర్చులు పెరిగాయి. రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఆస్పత్రుల్లో మందులున్నాయా? వ్యవసాయశాఖ పని చేస్తోందా? రైతులు చితికిపోయారా లేదా? ఆత్మహత్యలు పరిష్కారం కాదు. వైకాపాను ఉరి తీద్దాం రండి. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? నేను ఐటీ, టీచరు, పోలీసు ఉద్యోగం ఇస్తే.. జగన్ వాలంటీరు ఉద్యోగం ఇచ్చాడు. ఆఖరికి పాచిపని చేసుకోవాలన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. గతంలో నేను రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను. జగన్ దావోస్ వెళ్లి ఏం తెచ్చారు? అదానీ, గ్రీన్ కోతో ఒప్పందాలు కుదుర్చుకున్నది నేను కాదా?
జగన్కు ఇక నిద్రలేని రాత్రులే
‘మన సభ చూసి ఈ రోజు నుంచి జగన్కు నిద్ర పట్టదు. మహానాడుకు డబ్బులు కడతామన్నా బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు వాహనాలను రానివ్వలేదు. పోలీసులు కూడా సభకు వచ్చే కార్లలో గాలి తీసేశారు. పోలీసులూ మీ గాలి నేను తీసేస్తా. మాకు అడ్డు రాకండి.. మా శాంతిభద్రతలు మేమే చూసుకుంటామని చెప్పాం. అదుపు తప్పితే పోలీసులను కూడా నియంత్రించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది. బస్సులు నిలిపివేస్తే మనుషులు రారనుకున్నారు. ఇబ్బంది పెడితే భయపడతామనుకున్నారు. మంత్రులతో యాత్ర పెడితే జనాలు నమ్ముతారనుకున్నారు. వారి సభలు వెలవెల పోతే మన సభలు కళకళలాడాయి. మహానాయకుడు ఎన్టీఆర్ వారసులం మనం. ఆయన స్ఫూర్తితో ప్రజల కోసం కొండనైనా బద్దలుకొట్టగలం. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహించి, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళతాం. అన్ని జిల్లాలో మినీ మహానాడులు నిర్వహిస్తాం.
సామాజిక న్యాయం ఎవరికి?
సామాజిక న్యాయం అంటున్న వైకాపా నిజంగా న్యాయం చేసింది ఎవరికి? రాజ్యసభ సీట్లు ఆంధ్రవాళ్లకు 6, తెలంగాణకు 2, ఒకటి ముంబయి వారికి ఇచ్చారు. తనతోపాటు సీబీఐ కేసుల్లో ఉన్న ముగ్గురు నిందితులతోపాటు.. తెదేపా నుంచి తీసుకున్న ఇద్దరికి, సీబీఐ కేసులు వాదించే మరొకరికి అవకాశం కల్పించారు. బీసీలకు ఆదరణ పథకం లేదు. ఎస్సీలకు ఉప ప్రణాళిక అమల్లేదు. 29 కార్యక్రమాలను తీసేశారు. నిజమైన సామాజిక న్యాయం పాటించింది తెదేపానే. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయలేదు. సీపీఎస్ రద్దు చేయలేదు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. విలేకర్లకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్ ఇవ్వలేదు. కరోనాతో చనిపోయినవారికి పరిహారం చెల్లించలేదు. అందరికీ న్యాయం చేస్తా.
అమరావతి, పోలవరం ఏమయ్యాయి?
ఎన్నికలకు ముందు అమరావతి కొనసాగిస్తామని చెప్పిన జగన్రెడ్డి.. ఇప్పుడు దాన్ని నాశనం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై రూపాయి ఖర్చు చేయలేదు. పోలవరాన్ని మేం 72 శాతం పూర్తి చేస్తే ఈ మూడేళ్లలో మిగిలింది కట్టలేకపోయారు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టునే రివర్సు చేసేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై రూ.1,500 కోట్లు ఖర్చు చేశాం. తెదేపా ప్రభుత్వం ఉంటే మూడు నెలల్లో దాన్ని పూర్తి చేసి నీరిచ్చేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుతో పాటు ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అప్పులకు కక్కుర్తిపడి జగన్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి, వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మహానాడు సభకు భూములిచ్చిన రైతులను చంద్రబాబు అభినందించారు.
సెల్ఫోనే ఆయుధంగా పోరాడదాం
మహానాడుకు వచ్చిన ఈ భారీ స్పందన వారి సొంత మీడియాకు కనిపిస్తోందా? ఈ ప్రభుత్వం మీడియాను కూడా భయపెడుతోంది. మీ సమస్యలన్నింటినీ సెల్ఫోనే ఆయుధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయండి. కేసులు పెడతారని భయపడొద్దు. నేను అండగా ఉంటా. మీ కోసం ఉద్యమిస్తా.
35 తెరలపై అభిమాన వీక్షణం
మహానాడుకు అధిక సంఖ్యలో తెదేపా శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. వారంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభను వీక్షించేందుకు ప్రాంగణంలో 35 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రసంగాలు, నాయకుల చిత్రాలు స్పష్టంగా కనిపించడంతో ప్రతి తెర వద్ద సరాసరిన మూడు వేల మంది వరకు నిల్చున్నారు. తొలిరోజు ఉన్న జర్మన్ షెడ్ సగ భాగాన్ని బహిరంగ సభ దృష్ట్యా తొలగించడంతో వేదిక ఇరువైపులా అధిక సంఖ్యలో నిల్చుని తిలకించారు. టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళలు జన సమీకరణలో కీలకపాత్ర పోషించారు. సభకు వచ్చేవారికి సేవలందించడంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని సుమారు 1,600 మంది ప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు.
జగన్ అవినీతి రూ.1.75 లక్షల కోట్లు
జగన్ రాష్ట్రం అప్పులను రూ.8 లక్షల కోట్లకు పెంచారు. ఇదంతా ప్రజలే తీర్చాలి. మరోవైపు బాదుడే బాదుడు అంటూ కుటుంబానికి రూ.లక్ష భారం వేశారు. కోటీ 50 లక్షల కుటుంబాలకు నెలకు రూ.12 లక్షల భారం అంటే ఎంత? ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ఊరూ పేరూ లేని జేబ్రాండ్ మద్యంతో జనం జేబులు గుల్లచేస్తున్నారు. ఒకప్పుడు క్వార్టరు రూ.9 ఉండేది. ఇప్పుడు రూ.21 అయింది. పెంచిన ఆ రూ.12 జగన్ జేబులోకి వెళ్లిపోతోంది. మద్యం దుకాణాల్లో నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆ సొమ్ములో ఏడాదికి రూ.5వేల కోట్లు జగన్ సొంత ఖజానాకు వెళ్లిపోతోంది. ఈ మూడేళ్లలో జగన్ రూ.1.75 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ట్రాక్టరు ఇసుక అప్పట్లో రూ.500, రూ.600కు ఇస్తే ఇప్పుడు రూ.5వేలు. (జనంలో నుంచి ఎవరో రూ.6,000 అని అరిచారు). ఊళ్లలో మట్టి, బాక్సైట్, లేటరైట్ మొత్తం ఖనిజ సంపద అంతా వీరికే కావాలి. ఎకరం రూ.5 లక్షలు, రూ.6 లక్షలున్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం రూ.కోటికి కొని పంచుకు తినేస్తున్నారు. బద్వేల్లో రికార్డులు మార్చేసి, 800 ఎకరాలు ఆక్రమించేశారు. రోజూ 500 నుంచి 1000 లేటరైట్ లారీలు భారతీ సిమెంట్కు వెళ్లిపోతున్నాయి. కానీ సిమెంటు ధర మాత్రం తగ్గించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!