వైద్యం వ్యయప్రయాస

అనారోగ్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆస్తులు కరిగిపోతున్నాయి. జీవితాంతం కొద్దోగోప్పో కూడబెట్టిన సొమ్మును చికిత్స అందించే ఆసుపత్రులకు ధారపోయాల్సి వస్తోంది. అదీ సరిపోక... అప్పులపాలవుతున్నాయి. క్యాన్సర్‌కు ఎక్కువగా ఖర్చవుతోంది.

Published : 27 Nov 2022 05:33 IST

ఆస్తులు కరుగుతున్నాయ్‌.. అప్పులుపెరుగుతున్నాయ్‌!
జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2021లో వెల్లడి

ఈనాడు, అమరావతి: అనారోగ్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆస్తులు కరిగిపోతున్నాయి. జీవితాంతం కొద్దోగోప్పో కూడబెట్టిన సొమ్మును చికిత్స అందించే ఆసుపత్రులకు ధారపోయాల్సి వస్తోంది. అదీ సరిపోక... అప్పులపాలవుతున్నాయి. క్యాన్సర్‌కు ఎక్కువగా ఖర్చవుతోంది. ఆ తరువాత కార్డియోవాస్క్యులర్‌, కండరాలు, ఎముకల వ్యాధుల చికిత్సలకు డబ్బును అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2021 నివేదికలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అనారోగ్యాలు- ఖర్చుల వివరాలను ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరిన వారు తమ పొదుపు మొత్తాల నుంచి జాతీయస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 79.5%, పట్టణాల్లో 83.7% చొప్పున ఖర్చుపెడుతున్నారు. ఏపీలోనైతే గ్రామీణ ప్రాంతాల్లో 52.2%, పట్టణ ప్రాంతాల్లో 62.9% చొప్పున వ్యయం చేస్తున్నారు.


మన రాష్ట్రంలో...

*  గ్రామీణుల్లో 22.9% మందికి ఆరోగ్య బీమా లేదు. ప్రభుత్వ బీమా 76.1% మందికి ఉంది. పట్టణాల్లో బీమా సౌకర్యం లేనివారు 37.1% మంది,  ప్రభుత్వ బీమా ఉన్నవారు 55.9% మంది ఉన్నారు.

* చికిత్సల కోసం 365 రోజుల్లో పురుషులు సగటున పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1,470, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.31,974 చొప్పున ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కాన్పులు మినహా ప్రభుత్వాసుపత్రుల్లో మహిళలకు రూ.923, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.24,955 చొప్పున అవుతోంది.

* చికిత్సల కోసం గ్రామీణ ప్రాంతాల్లోనైతే ప్రభుత్వాసుపత్రుల్లో సగటున రూ.1,170, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.23,395 చొప్పున పురుషులకు ఖర్చవుతోంది. మహిళలు (కాన్పులు మినహా) ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1,262, ప్రైవేటు  ఆసుపత్రుల్లో రూ.15,761 వెచ్చించాల్సిందే.

* ప్రసవం కోసం గ్రామీణ, పట్టణ ప్రభుత్వాసుపత్రుల్లో రూ.987, రూ.1,680 చొప్పున ఖర్చవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.23,952, రూ.21,798 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో ప్రసవానికి ప్రభుత్వాసుపత్రుల్లో రూ.1,174, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.23,256 చొప్పున అవుతోంది.

* దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్యాన్సర్‌ వ్యాధి చికిత్స కోసం బాధితులు ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఒక్కో క్యాన్సర్‌ రోగికి సగటున ఏడాదికి గ్రామీణ భారతంలో రూ.56,996, పట్టణాల్లో రూ.68,259 చొప్పున ఖర్చవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని