పవన్‌ జులుంను ఎవరూ సహించబోరు: కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌

సినిమాల్లో నటననే రోడ్లపైకి తీసుకొచ్చి పవన్‌ కల్యాణ్‌ జులుం చేస్తే ఎవరూ సహించబోరని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరి(శేషు) అన్నారు.

Updated : 29 Nov 2022 04:03 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: సినిమాల్లో నటననే రోడ్లపైకి తీసుకొచ్చి పవన్‌ కల్యాణ్‌ జులుం చేస్తే ఎవరూ సహించబోరని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరి(శేషు) అన్నారు. తాడేపల్లిలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో అత్యంత దెబ్బతిన్నది కాపు కులమే. దాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే సహించేది లేదు. జగన్‌మోహన్‌రెడ్డిని ఈసారి అధికారంలోకి రానివ్వబోమని మీరు అంటున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కాపు పెద్దలంతా ఇదే వైకాపాలో ఉన్నారని.. ఆయా ప్రాంతాలు, జిల్లాలకు వారే నేతలని మీరు గుర్తుంచుకోవాలి. వైకాపాలో 29 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఒక్కరు చెప్పినంత మాత్రాన కాపులు వైకాపాకు ఓటెయ్యరనడం హాస్యాస్పదం. ఏ రోజూ కాపుల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచించని మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? కాపులపైనా, ముద్రగడపైనా కేసు పెట్టిన రోజు బయటకు రాని మీరు ఇప్పుడెందుకు వస్తున్నారు? వారానికో ప్రెస్‌మీట్‌ పెట్టి కాపు ఎమ్మెల్యేలు, వైకాపా, జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. 2014లో చంద్రబాబు విజయానికి మీరే కారణమని చెబుతున్నారు కదా.. ఆయన, మీరు కలిసి కాపులకు ఏం చేశారు’ అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. కాపుల సంక్షేమం కోసం ఎవరూ అడగకుండానే జగన్‌ కాపు నేస్తం ఇచ్చారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని