ఆర్థిక నావను కేంద్రం గట్టెక్కించేనా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఇబ్బందులను అధిగమించడంతో పాటు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం వైపు రాష్ట్రం ఎదురుచూస్తోంది.

Published : 30 Mar 2023 05:38 IST

ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఇబ్బందులను అధిగమించడంతో పాటు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం వైపు రాష్ట్రం ఎదురుచూస్తోంది. వివిధ మార్గాల్లో నిధులు రాబట్టుకునేందుకు పెద్దలు దిల్లీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవైపు బిల్లుల చెల్లింపుల కోసం ఒత్తిళ్లు, మరోవైపు ఎలాంటి రుణాత్మక నిల్వ లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగించి సున్నా నిల్వతో... లేదా కొద్దిపాటి నిల్వలతో కొత్త సంవత్సరంలోకి వెళ్లాలి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు వినియోగించుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.2,700 కోట్ల వరకు రిజర్వుబ్యాంకుకు ఆ చెల్లింపులు పూర్తిచేస్తే తప్ప కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యంకాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక గురు, శుక్రవారాలే మిగిలాయి. కేంద్రం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రూ.6,000 కోట్ల వరకు రావాలి. రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడం వల్లే ఆ నిధులను కేంద్రం ఆపిందని సమాచారం. ప్రస్తుతం ఆ నిధులు ఇస్తే తమ మ్యాచింగు గ్రాంటు మొత్తం ఏప్రిల్‌, లేదా మే నెలల్లో జతచేస్తామని రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. ఆ నిధులు తెచ్చుకునే ఆస్కారం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే బ్యాంకులను కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి నిధులిచ్చేందుకు రెండు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నా కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలతో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. రెండు బ్యాంకుల నుంచి చెరో రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఆ బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా కోరుతున్నట్లు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలోనే కొంత రుణం రిజర్వుబ్యాంకు నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. నికర రుణపరిమితి తేల్చేలోపు అడ్‌హాక్‌గా రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం.

ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్లు

కేంద్రప్రభుత్వం ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల కింద 90% పనులు పూర్తయి, మరో 10% పనులు పూర్తిచేస్తే ఫలితాలు వచ్చే పనులకు బిల్లులను ఈ నిధులతో చెల్లిస్తారని సమాచారం. ఇందుకోసం వివిధ ప్రభుత్వశాఖల నుంచి ఆయా కేటగిరీలో వచ్చే బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ప్రత్యేక ఆర్థికసాయం కింద మరికొంత నిధులు కేంద్రం నుంచి వచ్చే ఆస్కారం ఉందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని