సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలూ నేరమేనా?

‘నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు’ అని అధికార పార్టీ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అది మహా నేరమట.

Updated : 06 Apr 2023 08:47 IST

ప్రతిపక్షాల భావప్రకటన స్వేచ్ఛపై నిషేధమా?
వారిని అరెస్టు చేసి, వేధిస్తారా?
రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
ఈనాడు - అమరావతి

* ‘నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు’ అని అధికార పార్టీ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అది మహా నేరమట.

* ‘చంద్రగిరి నియోజకవర్గంలో నీకే దిక్కు లేదు. నీ బిడ్డకు ఎక్కడిది రా తమ్ముడూ’ అంటూ ప్రతిపక్ష కార్యకర్త ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అదీ శిక్షార్హమట.

* ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే.. ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే సమాచారాన్ని కూడా పోలీసులు బయటపెట్టొచ్చట..

రాష్ట్ర పోలీసులు చెబుతున్న సరికొత్త భాష్యాలివి. ప్రభుత్వాన్ని, వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, అభిప్రాయాలు వ్యక్తం చేసినా వారి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు ఈ ఉదంతాలు తాజా తార్కాణాలు మాత్రమే. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ వారిపైన చిన్న రాజకీయ విమర్శ చేసినా సహించేది లేదన్నట్లుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ పేరిట ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల్ని వేధిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావప్రకటన స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రంపై ప్రభుత్వం, పోలీసులు ఏమైనా నిషేధం విధించారా? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారే లక్ష్యంగా కొన్నాళ్ల కిందట వరకూ సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసేవారు. అరెస్టు చేసి, విచారణ పేరిట వేధించేవారు.

ఇప్పుడు ఈ బాధ్యతలను స్థానిక పోలీసులు నెత్తికెత్తుకున్నారు. కేసులు పెట్టి, అదుపులోకి తీసుకుని విచారణ పేరిట హింసిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై మాత్రం చర్యలే తీసుకోవట్లేదు. అసలు వారి నుంచి ఫిర్యాదులే స్వీకరించడం లేదు. అధికార పార్టీ వారు చేసినా, ప్రతిపక్షాల నాయకులు చేసినా అది తప్పే. ఎవరిపైనైనా సమానంగా చర్యలు ఉండాలి. కానీ రాష్ట్ర పోలీసులు మాత్రం ‘అధికార వైకాపా నాయకులు ఎంతటి నేరానికి తెగబడినా తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు వారి భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవటమూ నేరమే’ అన్నట్లుగా ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఇది హక్కులను కాలరాయటం కాదా?

* తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐటీడీపీ అధ్యక్షుడు రాకేశ్‌ చౌదరిని పోలీసులు ఇటీవల ఆయన ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో సమాచారమే ఇవ్వలేదు. స్థానిక తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌ వద్దకు వెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే ‘వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుమారుడిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టటంతో రాకేశ్‌ చౌదరిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం’ అని సీఐ ప్రకటించారు. రాజకీయ విమర్శలతో పోస్టులు పెడితే కౌన్సెలింగ్‌ పేరిట అదుపులోకి తీసుకోవటం ఏంటి? వ్యక్తులకు భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం ఉండదా? ప్రతిపక్షాలకు వాటిని ఏమైనా నిషేధించారా?

* సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న ఆవేదనతో శ్రీహరికోటకు చెందిన వైకాపా సానుభూతిపరుడు మంగపల్లి జ్యోతిష్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ బాబురెడ్డి.. వైకాపా నాయకుడికి వ్యతిరేకంగా పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. అధికార పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? ఆ హక్కు పోలీసులకు ఎక్కడిది?

* ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్‌ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే ఆ నేరంతో సంబంధం లేని అతని వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలను కూడా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఒకరి వ్యక్తిగత వివరాలను పోలీసులు బహిరంగంగా ఎలా ప్రకటిస్తారు? ఇది వ్యక్తిగత, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటం కాదా?

ప్రతిపక్ష నాయకులపై అసభ్య పోస్టులు పెడుతున్నవారిపై చర్యలేవి?

తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా, అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు.

* రాజమహేంద్రవరం అర్బన్‌ (తెదేపా) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కించపరుస్తూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లయినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఈ విషయాన్ని భవాని పలుమార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించినా చర్యలు శూన్యం.

* అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులను దూషిస్తూ వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు దాటుతున్నా కేసు లేదు.

* తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధలను ఉద్దేశించి వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు.

* తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంతకాల్ని ఫోర్జరీ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. కనీసం కేసు నమోదు చేయలేదు.

* తెదేపా నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పైన, ఆయన కుటుంబ సభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, చంపేస్తామని హెచ్చరించే పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదిచ్చారు. దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.

వైకాపాకు ఎదురుతిరిగితే చట్టాలు అండగా నిలబడవా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా ఇటీవల సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దళిత మహిళ అయిన ఎమ్మెల్యే, ఆమె కుమార్తెలపైన వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదులు అందినా కేసు నమోదు చేయలేదు. ఇదంతా వైకాపాకు ఎదురుతిరిగితే చట్టాలేవీ మీకు అండగా నిలబడవని, మీపై ఎంతటి నేరం జరిగినా చూస్తూ ఉంటామని పోలీసులు చెబుతున్నట్లు కాదా?

వైకాపా శ్రేణులపై కేసులు ఎత్తేసుకోవచ్చా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులా?

* ‘గత ప్రభుత్వ హయాంలో వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఇప్పటికే పార్టీ తరఫున డీజీపీని కలిశాం. అధికారికంగా డీజీపీకి లేఖ రాస్తాం. మీపై నమోదైన కేసుల వివరాల్ని కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే వాటిని ఎత్తేయించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది’ అని 2019 ఆగస్టు 14న జరిగిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాత 2020 డిసెంబరు 6న విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ‘వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై గత ప్రభుత్వంలో నమోదైన 135 కేసులకు గాను 120 ఉపసంహరించుకున్నాం. న్యాయస్థానాల్లో మరో 7 కేసుల విచారణ  కొనసాగుతోంది. వాటిలో పార్టీ తరఫున న్యాయసహాయం అందిస్తున్నాం’ అని వెల్లడించారు.

* వైకాపా కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అసభ్యపదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే వారిపై నమోదైన కేసుల్ని ఎత్తేస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని, విధానాల్లోని లోపాల్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారిపైన కేసులు నమోదు చేసేసి అరెస్టు చేస్తారా? మరీ ఇంత ఏకపక్ష, పక్షపాత ధోరణా? ఈ రాష్ట్రంలో వైకాపా కోసం పోలీసులు ప్రత్యేక చట్టమేమైనా అమలు చేస్తున్నారా?


45 నెలల్లో వందల మందిపై కేసులు

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, తటస్థులు, పాత్రికేయులు ఇలా ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా వారిపై కేసులు పెట్టి అణచివేస్తున్నారు.. 45 నెలల్లో వందల మందిపై ఇలా కేసులు పెట్టి వేధించారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కేసులు పెడుతున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్లు బనాయిస్తున్నారు. గతంలో రాజద్రోహం సెక్షన్లు కింద కూడా కేసులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు