మార్గదర్శి కేసుల్ని మరో హైకోర్టుకు మార్చండి: ఏపీ పిటిషన్‌.. మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ఏపీ సీఐడీ వేసిన కేసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను.. తెలంగాణ హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Updated : 06 Jun 2023 06:16 IST

తదుపరి విచారణ జులై 18కి వాయిదా

ఈనాడు, దిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ఏపీ సీఐడీ వేసిన కేసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను.. తెలంగాణ హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులను పూర్తిగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయాన్ని వెలువరిస్తామంటూ జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని ఆ సమయంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ తొలుత వాదనలు వినిపిస్తూ ‘మార్గదర్శి సంస్థ కొన్ని చిట్‌ఫండ్‌ బ్రాంచ్‌లను ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్‌లు అక్కడ వసూలైన మొత్తాన్ని ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మళ్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తులో తేలింది’ అన్నారు.

మార్గదర్శి సంస్థ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్‌ ఎలా దాఖలు చేశారో తెలియడం లేదు, ఒకసారి ఆర్టికల్‌ 139(ఎ) చూడండి అని ధర్మాసనాన్ని కోరారు. ఇది క్రిమినల్‌ కేసా అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ప్రశ్నించారు. ఆర్టికల్‌ 226 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ అని హరీష్‌ సాల్వే చెప్పగా.. రిట్‌ పిటిషన్లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 406 వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇవి ఆర్టికల్‌ 139 పిటిషన్లని సాల్వే చెప్పారు. జస్టిస్‌ బోస్‌ బదులిస్తూ సుప్రీంకోర్టులో కూడా అలాంటి కేసులే పెండింగ్‌లో ఉంటే ఆర్టికల్‌ 139 వర్తిస్తుందన్నారు. హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ.. అన్నింటికంటే దారుణమేంటంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు పరిధిని సవాల్‌ చేస్తూ అక్కడ పిటిషన్‌ దాఖలు చేసినా, హైకోర్టు తనకు ఆ పరిధి ఉన్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడానికి బదులు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని చెప్పారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 406 ప్రకారం దాఖలు చేసిన అప్లికేషన్‌ కేవలం క్రిమినల్‌ కేసులకే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. అందుకు ఆయన బదులిస్తూ దాన్ని ఆర్టికల్‌ 139తో కలిపి చూడాలన్నారు. ఇక్కడ ఆర్టికల్‌ 139 వర్తించదని హరీష్‌ సాల్వే బదులిచ్చారు.

రాజ్యాంగంలోని 139(ఎ)(2) ప్రకారం వేగంగా న్యాయం చేయడానికి ఏ హైకోర్టు ముందున్న కేసునైనా మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అది రెండు, అంతకు మించి హైకోర్టుల ముందు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడే వర్తిస్తుందని జస్టిస్‌ బోస్‌ తేల్చిచెప్పారు. ఇలాంటి కేసు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, అక్కడ వాళ్లు మధ్యంతర ఉత్తర్వులు పొందారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈ అంశంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పినా దానిపై వారు అక్కడ కనీసం సమాధానం కూడా దాఖలు చేయలేదని, అందువల్ల ఆర్టికల్‌ 139 విషయంలో ఇలాంటి రాజకీయాలకు అనుమతివ్వకూడదని సాల్వే కోరారు. తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయడం లేదని, కేసును వింటామని జస్టిస్‌ బోస్‌ స్పష్టం చేశారు.  

తెలంగాణ హైకోర్టు పరిధిపై సవాల్‌ చేయలేదు

మార్గదర్శి తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నట్లు, అక్కడ సోదాలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లోనే పేర్కొందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన జ్యూరిస్‌ డిక్షన్‌ తమకు ఉందని తెలంగాణ హైకోర్టు సవివరమైన తీర్పు కూడా ఇచ్చిందన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు కూడా చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఏపీలో దాఖలైన ఛార్జిషీట్లపై తెలంగాణ హైకోర్టు విచారిస్తోందన్నారు.

హరీష్‌ సాల్వే జోక్యం చేసుకుంటూ.. ఇలా వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. వాదనలన్నీ విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ రిట్‌ పిటిషన్‌ నం.7100/ 2023ని ఏప్రిల్‌ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున దానిపై విచారణ ముగిసిందని, అందువల్ల ఆ ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ను తీసుకోరాదని కోరారు. ఆ విషయం తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. న్యాయమూర్తి ఆ విషయాన్ని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని