New Districts: కొత్త జిల్లాలకు శ్రీకారం

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతం కాబోతోంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపాలతో కొత్త జిల్లాల ఉనికి సోమవారం నుంచి అమలులోకి రానుంది. నిన్నటిదాకా 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. కొత్తగా ఏర్పడుతున్న మరో 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలతో పాలన సాగించనుంది...

Updated : 04 Apr 2022 05:41 IST

నేటి నుంచే అమలులోకి..
ఉదయం సీఎం జగన్‌ సందేశం
కలెక్టరేట్లు, కార్యాలయాలు సిద్ధం
ఉద్యోగుల కేటాయింపు పూర్తి

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతం కాబోతోంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపాలతో కొత్త జిల్లాల ఉనికి సోమవారం నుంచి అమలులోకి రానుంది. నిన్నటిదాకా 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. కొత్తగా ఏర్పడుతున్న మరో 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలతో పాలన సాగించనుంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను దాదాపుగా పరిగణనలోకి తీసుకొని, ఏపీ జిల్లాల ఏర్పాటు-1974 సెక్షన్‌ 3(5) నిబంధన ప్రకారం ప్రభుత్వం పునర్విభజన చేపట్టింది. దీనిపై గత జనవరి 25న ప్రాథమిక నోటిఫికేషన్‌ వెలువడింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనల తర్వాత తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు 68 రోజుల సమయం పట్టింది. ప్రణాళిక సంఘం, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, సాధారణ పరిపాలన విభాగం, ఆర్థిక శాఖలు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాయి.

కొత్త ప్రదేశాలకు ఉద్యోగులు

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీవో, ఇతర డివిజన్‌ స్థాయి అధికారుల పరిధులు తగ్గిపోతున్నాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న అధికారులు, సిబ్బంది కేటాయించిన చోటుకు చేరుకుంటున్నారు. జనాభా, కార్యాలయాలు, మండలాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించారు. పాత, కొత్త జిల్లాల నడుమ ఉద్యోగుల విభజన 55:45, 60:40 నిష్పత్తిలో చేయగా, కొన్నిచోట్ల ఇంకా హెచ్చుతగ్గులు అనివార్యమయ్యాయి. శాఖల వారీగానూ కొంత వ్యత్యాసం ఉంది. జూనియర్‌ సిబ్బందిని ‘రివర్స్‌’ సీనియారిటీ ద్వారా కొత్త జిల్లాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో 70 వరకు ప్రభుత్వ శాఖలు, 120 కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో ముఖ్యమైన కార్యాలయాలు మాత్రమే నడవనున్నాయి. సైనిక సంక్షేమం, ఉద్యానం తదితర తక్కువ సిబ్బంది ఉండే శాఖల ఉద్యోగులు పాత జిల్లాల్లోనే ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కొత్త ప్రదేశానికి మారుతున్న సహచరులకు వీడ్కోలు పలుకుతూ, ఉద్యోగ వర్గాలు గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు

నూతన జిల్లాల ప్రారంభానికి సోమవారం ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సందేశమివ్వనున్నారు. జిల్లాల పునర్విభజనపై  సమగ్ర నివేదికను ప్రణాళిక సంఘం    కార్యదర్శి ముఖ్యమంత్రికి అందజేస్తారు. సీఎం ఎలక్ట్రానిక్‌ బటన్‌ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వస్తుంది. అనంతరం బాపట్ల, అల్లూరి సీతారామరాజు, తిరుపతి కలెక్టర్లతో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మాట్లాడతారు. ఈ కార్యక్రమం 9.55 కల్లా ముగిసేలా షెడ్యూలు రూపొందించారు. కొత్త కలెక్టరేట్లను అందంగా తీర్చిదిద్దారు. జాతీయ జెండా వందనం తర్వాత స్పందన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా భౌగోళిక పటం అమర్చడంపై ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.

నేడు బాధ్యతల్లోకి కలెక్టర్లు, ఎస్పీలు

కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలను నియమించగా ఆదివారం ఎక్కడా కలెక్టర్లు బాధ్యతలు చేపట్టలేదు. కొంతమంది ఎస్పీలు విధుల్లో చేరారు. పుట్టపర్తి- రాహుల్‌ దేవ్‌సింగ్‌, రాయచోటి- హర్షవర్ధన్‌రాజు, బాపట్ల- వకుల్‌ జిందాల్‌, పశ్చిమగోదావరి- అమ్మిరెడ్డి, అనకాపల్లి- గౌతమి, అమలాపురం- సుబ్బారెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన చోట్ల ఉన్నతాధికారులు సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


26 మంది డీఆర్వోల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో 26 జిల్లాలకు 26 మంది జిల్లా రెవెన్యూ అధికారులను (డీఆర్వో) నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.


44 మంది ఆర్డీవోలు వీరే

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 44 మంది ఆర్డీవోలను నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని