Indian Railway: రైలు ప్రయాణం వాయిదా పడిందా? క్యాన్సిలేషన్‌ ఛార్జీలు పడొద్దంటే..?

Train ticket reschedule: ప్రయాణికులు పూర్తిగా ప్రయాణాన్ని రద్దు చేసుకోకుండా, ముందు లేదా తర్వాతి తేదీలకు ప్రయాణాన్ని మార్చుకోవాలనుకుంటే, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు లేకుండానే టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు.

Updated : 06 Jan 2023 10:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఫలానా తేదీన రైలు ప్రయాణం (Train Journey) అనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్‌ చేసిపెట్టుకుంటాం. ఒక్కోసారి అనుకున్న షెడ్యూల్‌లో ఏదైనా మార్పులు వచ్చి ప్రయాణాన్ని ముందుగానే చేయాల్సి రావొచ్చు. లేదంటే వాయిదా వేయాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో టికెట్‌ రద్దు (Ticket cancellation) చేసి మళ్లీ బుక్‌ చేసుకోవాల్సి వస్తుంది. టెకెట్‌ రద్దు చేసుకుంటే రైల్వే శాఖ క్యాన్సిలేషన్‌ రుసుములు మినహాయించుకుని మిగిలిన డబ్బును మాత్రమే తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు కొంత డబ్బును నష్టపోతుంటారు.

అయితే, ప్రయాణికులు పూర్తిగా ప్రయాణాన్ని రద్దు చేసుకోకుండా ముందు లేదా తర్వాతి తేదీలకు ప్రయాణాన్ని మార్చుకోవాలనుకుంటే, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు లేకుండానే టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు రైలు ప్రయాణం ప్రారంభం కావడానికి కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్‌ కౌంటర్‌ పనివేళల్లో వెళ్లి మీ టికెట్‌ను సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు ఏ తేదీన ఏ సమయంలో ప్రయాణించాలనుకుంటున్నారో రిజర్వేషన్‌ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయాలి. ఈ సమయంలో ప్రయాణికులు ప్రయాణపు తరగతిని కూడా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

రిజర్వేషన్‌ కౌంటర్‌ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి మీరు కావాలనుకుంటున్న తేదీరోజు టికెట్లు అందుబాటులో ఉంటే  సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం అదనపు ఛార్జీలు తీసుకోరు. ఒకవేళ మీరు తరగతిని అప్‌గ్రేడ్‌ చేసినట్లయితే.. తగిన టికెట్‌ ధరను మాత్రం తీసుకుంటారు. ఈ సదుపాయం కన్ఫర్మ్‌ టికెట్‌ ఉన్నవారితో పాటు, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారు సైతం ఒకసారి ఉపయోగించుకోవచ్చు.

బోర్డింగ్‌ స్టేషన్‌నూ మార్చుకోవచ్చు..

రైలు మొదటి రిజర్వేషన్‌ ఛార్ట్‌ను సిద్ధం చేయడానికి ముందే ఇందుకోసం అభ్యర్థించాల్సి ఉంటుంది. చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ లేదా డ్యూటీలో ఉన్న రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కి.. ఏదైనా కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ (PRS) సెంటర్‌లో పనిగంటల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా 139 ద్వారా, కంప్యూటరైజ్డ్ పీఆర్‌ఎస్‌ కౌంటర్ల ద్వారా  ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ సౌకర్యం ఉంది. ప్రయాణపు టికెట్‌ బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకున్నంత మాత్రాన ప్రయాణించని దూరానికి రిఫండ్‌ రాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని