ఆధార్‌ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్‌ విత్‌డ్రా ఎలా చేసుకోవాలి?

Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్‌డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్‌ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం..

Published : 11 Apr 2024 12:23 IST

Aadhaar ATM | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకున్నా.. ఇప్పటికీ నగదు లేనిదే కొన్ని పనులు జరగవు. అందుకే ఎప్పుడూ ఇంట్లో కొంత మొత్తం ఉండాల్సిందే. అయితే బ్యాంకు, ఏటీఎంకు వెళ్లలేని వారికి నగదు అవసరం పడితే పరిస్థితి ఏంటి? అలాంటి వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఇంటి వద్దకే వచ్చి నగదు అందిస్తోంది. ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ (AEPS) సేవల్ని అందిస్తోంది. ఇంతకీ ఈ సేవలు ఎలా పొందాలి?

AEPS అనేది ఆధార్‌ ఆధారిత బ్యాంకు ఖాతాను యాక్సెస్‌ చేసే ఓ పేమెంట్‌ సర్వీస్‌. బ్యాలెన్స్‌ వివరాలు, నగదు ఉపసంహరణ, రెమిటెన్స్‌ లావాదేవీలు జరిపేందుకు ఈ సర్వీస్‌ అనుమతిస్తుంది. దీని సాయంతో బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా చిన్న మొత్తాలను ఇంటి నుంచే విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో మీ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. కేవలం బయోమెట్రిక్‌ సాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఏఈపీఎస్‌ సేవల్ని ఎలా పొందాలంటే..?

ఆధారిత బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి. ఆ బ్యాంక్‌ ఏఈపీఎస్‌ సేవలందించే జాబితాలో ఉండాలి. దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ దాదాపు ఈ సేవలందిస్తున్నాయి. అలాగే వ్యక్తుల ఆధార్‌ బ్యాంక్‌ ఖాతాతో లింకై ఉండాలి. ఆపై బయోమెట్రిక్‌ వివరాల ద్వారా లావాదేవీలు పూర్తవుతాయి. AEPS సాయంతో క్యాష్‌ విత్‌డ్రాతో పాటు, బ్యాలెన్స్‌ వివరాలు, మినీ స్టేట్‌మెంట్‌, ఆధార్‌ టు ఆధార్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి సేవలు పొందొచ్చు. ఈ సేవల్ని పొందేందుకు ఆధార్‌కార్డ్‌ తప్పనిసరిగా ఉండాలనే నియమం లేదు. బయోమెట్రిక్‌ చాలు. ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు. డోర్‌స్టెప్‌ సేవల్ని వినియోగించుకున్నందుకు మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి గరిష్ఠంగా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ పొందేందుకు సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో మీరు పేరు, చిరునామా, మీకు దగ్గర్లో ఉండే పోస్టాఫీస్‌ను ఎంచుకోవాలి. అలాగే, ఈ సేవల గురించి మరిన్ని వివరాల కోసం పోస్టల్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని