PAN- Aadhaar: పాన్‌- ఆధార్‌ అనుసంధానంపై ఐటీశాఖ అలర్ట్‌.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

PAN- Aadhaar: పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది.

Published : 10 Dec 2022 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. 

‘‘ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్‌ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి’’ అని తన ట్విటర్‌లో పేర్కొంది.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్‌ నిరుపయోగంగా మారి బ్యాంక్‌ ఖాతాలు గానీ, డీమ్యాట్‌ అకౌంట్‌ గానీ తెరవడానికి సాధ్యపడదు.

ఎలా చెల్లించాలి..?

  • పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి ముందు మీరు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • ఇందుకోసం తొలుత Tax applicable - (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • తర్వాత పాన్‌, మదింపు సంవత్సరం, పేమెంట్‌ విధానం, అడ్రస్‌, ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు ఇవ్వాలి.
  • క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి పేమెంట్‌ పూర్తి చేయాలి.
  • ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో పాన్‌ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని