IRCTC tour package: కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ

IRCTC tour package: వేసవిలో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ అందిస్తున్న కేరళ టూర్‌ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి..

Updated : 03 Apr 2024 12:27 IST

IRCTC tour package | ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవి సెలవులు వచ్చాయంటే వెంటనే గుర్తుకొచ్చేది విహారం. చాలామంది తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్‌ చేస్తుంటారు. ఒకవేళ మండు వేసవిలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటూ ఉంటే.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అందిస్తున్న కేరళ టూరిజం ప్యాకేజీని పరిశీలించండి. అందమైన ప్రకృతి సోయగాలకు నెలవైన కేరళలోని ప్రదేశాలను తక్కువ ఖర్చులోనే వీక్షించే సదుపాయాన్ని అందిస్తోంది. 

కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో టూరిస్టులు రైలు ఎక్కొచ్చు. కేరళ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. ప్రస్తుతం ఏప్రిల్‌ 9, 16, 23, 30.. మే 14, 21, 28 తేదీల్లో (ప్రతి మంగళవారం) టూర్‌ వెళ్లాలనుకొనే వారికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

రైలు ప్రయాణం ఇలా..

  • మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం. 17230) బయల్దేరుతుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది మున్నార్‌కు తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో అ రోజు రాత్రి బస ఉంటుంది.
  • మూడో రోజు ఎరవికులం నేషనల్‌ పార్క్‌, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌ వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ మున్నార్‌లోనే సేద తీరాలి.
  • నాలుగో రోజు ఉదయం అలెప్పీ చేరుకుంటారు. ఆ రోజంతా అలెప్పీ చుట్టుపక్కనున్న అందాలను వీక్షించటానికి వెళ్తారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 11:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.17229) బయల్దేరుతుంది.
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ఛార్జీలు ఇలా.. 

  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.35,570, ట్విన్ షేరింగ్‌కు రూ.20,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,570 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.8,840, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,580 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.32,860, ట్విన్ షేరింగ్‌కు రూ.17,720, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,860. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,130, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.3,870 చెల్లించాలి. ఒకవేళ నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే ప్యాకేజీ ఛార్జీలు కొంత మేర తగ్గుతాయి.

ఇవి ప్యాకేజీలో భాగమే..

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
  • కేరళలో మూడు రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.
  • టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

వీటి బాధ్యత యాత్రికులదే

  • మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  • పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
  • బోటింగ్‌, హార్స్‌ రైడింగ్‌ వంటివి ప్యాకేజీలో ఉండవు.
  • గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

క్యాన్సిలేషన్‌ పాలసీ

ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్‌ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అదే 8 - 14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4 - 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు

ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని