పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్‌ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!

RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది.

Published : 17 Feb 2024 01:57 IST

Paytm Payments Bank | ఇంటర్నెట్‌ డెస్క్‌: పేటీఎం (Paytm) పేమెంట్స్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank), వాలెట్‌లతో పాటు క్యూఆర్‌ కోడ్‌లు, సౌండ్‌ బాక్స్‌ల గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది ఆర్‌బీఐ. వినియోగదారుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అలాగే, గతంలో ఫిబ్రవరి 29గా నిర్దేశించిన గడువును.. మార్చి 15 వరకు పొడిగించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఆర్‌బీఐ FAQ

  • నగదు విత్‌డ్రా: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. అలాగే, పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన డెబిట్‌ కార్డు ద్వారా నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చు. 15 తర్వాత పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్స్‌, పార్ట్‌నర్‌ బ్యాంక్స్‌ నుంచి స్వీప్‌-ఇన్‌, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు.
  • వేతన ఖాతా: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్‌ ఉంటే మార్చి 15 తర్వాత నగదును అందుకోలేరు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
  • సబ్సిడీ: ప్రభుత్వం నుంచి ఆధార్‌తో అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • ఆటో డెబిట్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్‌ (NACH)కు అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్‌కు అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌: పేటీఎం పేమెంట్‌ బ్యాంక్స్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత ఖాతాలో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్‌కు అవకాశం ఉంటుంది. 
  • వాలెట్‌: మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్‌లో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్‌బ్యాక్‌, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వాలెట్‌ క్లోజ్‌ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు.
  • ఫాస్టాగ్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్‌ ఉండేంత వరకు వినియోగించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. కాబట్టి వేరే బ్యాంక్‌ నుంచి ఫాస్టాగ్‌ తీసుకోవడం మంచిది. ఫాస్టాగ్‌లో నగదును బదిలీ చేయడం కుదరదు. కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను సంప్రదించి రిఫండ్‌ కోరొచ్చు.
  • NCMC: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ జారీ చేసిన నేషనల్‌ కామన్‌ మొబిలీ కార్డుదారులు (NCMC) సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్‌ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇతర బ్యాంకులు జారీ చేసే ఈ తరహా కార్డులను తీసుకోవచ్చు. ఇందులోని నగదును కూడా వేరే కార్డుకు బదిలీ చేయడం కుదరదు. కావాలంటే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను రిఫండ్‌ కోరొచ్చు.
  • UPI: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు అనుసంధానం అయిఉన్న యూపీఐ/IMPS ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ/IMPS ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. 
  • క్యూఆర్‌ కోడ్‌లు, పేటీఎం సౌండ్‌ బాక్స్‌లు: పేటీఎం క్యూఆర్‌ కోడ్‌లు, పేటీఎం సౌండ్‌ బాక్స్‌లు లేదా పీఓఎస్‌ టర్మినల్స్‌ వినియోగిస్తున్న మర్చంట్స్‌.. ఇతర బ్యాంకులతో అనుసంధానం అయి ఉంటే వాటిని మార్చి 15 తర్వాత కూడా యథాతథంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ వాటికి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ అనుసంధానం అయ్యి ఉంటే.. అందులో ఎలాంటి నిధులూ జమ కావు. కాబట్టి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కాకుండా వేరే బ్యాంక్‌ ఖాతాను వాటికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఉన్న ఫండ్స్‌ను భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌కు మళ్లించుకోవచ్చు.

ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రశ్నల జాబితా కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని