IRCTC tour package: వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు

IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి.

Published : 07 Apr 2024 00:06 IST

IRCTC tour package | ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవి సెలవులనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చే ప్రాంతం ఊటీ. పచ్చని ప్రకృతి, అందమైన సరస్సులు, ఎత్తయిన కొండల మధ్య ప్రయాణం ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రకృతి అందాలకు నెలవైన ఊటీలో ఈ వేసవిలో విడిది చేయాలనుకొనే వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని అందిస్తోంది. ప్రయాణం, వసతి ఏర్పాట్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్యాకేజీ వివరాలు చూసేయండి.

అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఏప్రిల్‌ 9 నుంచి మే 28 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఊటీ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. ఏప్రిల్‌ 9కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే విక్రయమవ్వగా.. ఏప్రిల్‌ 16, 23, 30, మే 14, 21, 28 తేదీల్లో ప్రయాణించాలనుకొనే వారికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణం ఇలా..

  • మొదటిరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) బయల్దేరుతుంది. 
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీలో హోటల్‌లోనే బస ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ ఊటీలోనే బస చేయాలి. 
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం కూనూర్‌ పర్యటనకు తీసుకెళ్తారు. తిరిగి ఊటీకి చేరుతారు. రాత్రి మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు అదే హోటల్‌లో అల్పాహారం చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్‌ పయనమవుతారు. సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) ఎక్కాలి. 
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.  

ఛార్జీలు ఇలా.. 

  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.33,020, ట్విన్ షేరింగ్‌కు రూ.18,480, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,870 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,430, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,180 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.30,560, ట్విన్ షేరింగ్‌కు రూ.16,020, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,410. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,970, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,730 చెల్లించాలి. గ్రూప్‌ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
  • ఊటీలో మూడు రాత్రులు ఉండడానికి ఏసీ గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగానే ఉంటాయి.

వీటి బాధ్యత ప్రయాణికులదే..

  • మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి. రైలు ప్రయాణంలోనూ భోజన ఏర్పాట్లు ఉండవు.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
  • బోటింగ్‌, హార్స్‌ రైడింగ్‌ వంటివి ప్యాకేజీలో ఉండవు.
  • గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.
  • ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. యాత్రకు 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్‌ మొత్తం ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని