Accident: వంతెనపై నుంచి వాగులోకి బస్సు బోల్తా

అప్పటి దాకా సజావుగా సాగిన ప్రయాణం... మరికొద్దిసేపట్లో చేరుకోనున్న గమ్యం... అంతలోనే బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి రెయిలింగ్‌ ఢీకొడుతూ వాగులోకి దూసుకుపోయింది... ఏం జరుగుతోందో

Updated : 16 Dec 2021 10:05 IST

10 మంది దుర్మరణం

25 మందికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం

ప్రకటించిన ప్రధాని మోదీ

5 లక్షల చొప్పున పరిహారం: సీఎం జగన్‌

జల్లేరు వాగులో పడిన బస్సును క్రేన్‌ సహాయంతో బయటకు తీస్తున్న సహాయక సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, ఏలూరు- న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం: అప్పటి దాకా సజావుగా సాగిన ప్రయాణం... మరికొద్దిసేపట్లో చేరుకోనున్న గమ్యం... అంతలోనే బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి రెయిలింగ్‌ ఢీకొడుతూ వాగులోకి దూసుకుపోయింది... ఏం జరుగుతోందో తెలిసేలోపే కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన దగ్గర బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆప్తులను కోల్పోయిన వారి వేదన, గాయాలు మిగిల్చిన ఆవేదన, కాపాడండి... అనే ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జల్లేరు వాగు రక్తపు మడుగులా మారింది.

వేలేరుపాడు నుంచి భద్రాచలం మీదుగా జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. ఉదయం 11.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేరుకోవాల్సి ఉండగా 12.00 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది పశ్చిమగోదావరి జిల్లావాసులు కాగా... ఒకరిది తూర్పుగోదావరి జిల్లా. 25 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. యువకులు జల్లేరులో దిగి సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని పడవల ద్వారా బస్సు వద్దకు చేరుకుని కొందరిని రక్షించారు. మృతదేహాలను వెలికి తీశారు.
క్షతగాత్రులను ఒడ్డుకు చేర్చారు. స్థానిక పోలీసులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మూడు క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీశారు. ఇందుకు 3 గంటలు పట్టగా... అంతసేపూ 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

ఘటన స్థలంలో  మృతదేహాలు

మృతుల వివరాలివీ..

మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఆడమిల్లి జాన్‌మోజెస్‌ (52), ఎం.లక్ష్మి(40), పొడపాటి దుర్గమ్మ(55), ఉండ్రాజవరపు సరోజిని (56), బడుగు సత్యవతి(58), శ్రీరాముల బుల్లెమ్మ(45), కేతా వరలక్ష్మి(62), బస్సు డ్రైవర్‌ సాలుమూరి చిన్నారావు(46),  పాలడుగుల మహాలక్ష్మి(45), తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన సోమరాజు(55) మృతుల్లో ఉన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం

మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, 5 లక్షల పరిహారం

సీఎం జగన్‌ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

ఆర్టీసీ నుంచి రూ.2.50 లక్షల చొప్పున పరిహారం

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ప్రకటించారు. ఘటన స్థలాన్ని కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామన్నారు. ఇది కాలం చెల్లిన బస్సు కాదని 2019లో కొన్నదేనని, లాక్‌డౌన్‌ కారణంగా ఏడాదికి మించి తిరగలేదన్నారు.

జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, అధికారులు

సమగ్ర విచారణకు మంత్రి ఆదేశం

బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు.


స్టీరింగ్‌ పట్టేయడమే కారణమా?

ఈనాడు, అమరావతి: జల్లేరు వాగులో బస్సు పడటానికి కారణం ఏమిటనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పిందని కొందరు అంటుంటే, డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యారని మరికొందరు చెబుతున్నారు. ప్రమాదానికి గురై వంతెనపై పడిపోయిన ద్విచక్రవాహన దారుడిని తప్పించే క్రమంలో బస్సు వాగులో పడిందని ఇంకొంత మంది వెల్లడించారు. ఉన్నట్లుండి బస్సు వాగులోకి దూసుకెళ్లిందని, ఏం జరిగిందో తమకు తెలిదని గాయపడిన ప్రయాణికులు చెప్పారు. ముఖ్యంగా స్టీరింగ్‌ పట్టేయడంతో, బస్సు అదుపు తప్పి వాగులోకి వెళ్లింది అని కొందరు ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయం. ప్రమాదంలో మృతిచెందిన డ్రైవర్‌ చిన్నారావుకు క్లీన్‌ రికార్డు ఉందని, గతంలో ఆయన మేజర్‌ ప్రమాదాలు చేయలేదని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇదే బస్సు ఈ ఏడాది అక్టోబరు 20న భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా అశ్వారావుపేట మండలం ఆసుపాక ముత్యాలమ్మ గుడి వద్ద స్టీరింగ్‌ తిరగకపోవడంతో.. రోడ్డుకు కుడివైపు వెళ్లి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌ను బాధ్యుడిగా పేర్కొని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆయనకూ క్లీన్‌ రికార్డు ఉందని తెలిసింది. అదే బస్సు ఇప్పుడు ప్రమాదానికి గురికావడంతో.. స్టీరింగ్‌ సమస్యే ప్రమాదానికి కారణమయ్యే వీలుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మూడేళ్ల కిందట తయారైన బస్సే అయినప్పటికీ స్టీరింగ్‌ సమస్య తలెత్తేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


పొలాల్లోకి దూసుకెళ్లిన మరో బస్సు

కాకుమాను, న్యూస్‌టుడే: ఇంజిన్‌లో పెద్ద శబ్దం రావడం, స్టీరింగ్‌ సరిగా పనిచేయక ఆర్టీసీ బస్సొకటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని అప్పాపురంలో బుధవారం చోటుచేసుకుంది. 25 మంది ప్రయాణికులతో కాకుమాను నుంచి బాపట్ల వెళుతుండగా సాంకేతిక లోపంతో అదుపుతప్పింది. డ్రైవరు, కండక్టర్‌ సహా ఏడుగురికి గాయాలయ్యాయి.


గోతుల్లో పడి కట్టలు విరిగి..

పెనుగొండ, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం కమలాపురం నుంచి నరసాపురం వెళ్తున్న బస్సు పెనుగొండ శివారులో రహదారిపై పెద్ద గోతుల కారణంగా కమాన్‌ కట్టలు విరిగి, చక్రాలు అడ్డంతిరిగి అదుపుతప్పింది. నిడదవోలు-నరసాపురం కాలువ వైపు దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి నిలిపివేయడంతో బస్సులోని 17 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని