Crime News: క్షణికావేశం.. పశ్చాత్తాపం.. ఇద్దరి బలవన్మరణం

భార్యతో తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

Updated : 30 Mar 2023 07:41 IST

భర్త పురుగు మందు తాగారని...   భార్య ఆత్మహత్య
కుమార్తె మృతి చెందిందని తనువు చాలించిన తల్లి
గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో విషాద ఘటనలు

షాబాద్‌, న్యూస్‌టుడే: భార్యతో తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. తన వల్లే భర్త అలా చేశారనే పశ్చాత్తాపంతో భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కుమార్తె కాపురం ఇలా అయ్యిందేమిటనే ఆవేదనతో.. ఆమె తల్లి సంపులో దూకి తనువు చాలించారు. ఈ విషాద సంఘటనలు బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువయ్యగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు...హైతాబాద్‌ గ్రామానికి చెందిన మల్లేశ్‌, యాదమ్మలకు ఒక కుమార్తె, కుమారుడు. మల్లేశ్‌ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. కుమార్తె సుమిత్ర అలియాస్‌ శిరీషకు రెండున్నర సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. వారి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో శివకుమార్‌ ఆదివారం పురుగుల మందు తాగారు. చికిత్స కోసం ఆయనను వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన కారణంగానే భర్త ఆత్మహత్యకు యత్నించారన్న మనస్తాపంతో సుమిత్ర మంగళవారం రాత్రి హైతాబాద్‌లోని తల్లిగారి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె మృతి చెందడాన్ని బుధవారం ఉదయం గమనించిన తల్లి యాదమ్మ(45).. తన కుమార్తె జీవితం ఇలా అయ్యిందే అన్న బాధ]తో ఇంటి ముందు ఉన్న సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని