భర్త మృతదేహానికి ఇంట్లోనే అంత్యక్రియలు

కుమారులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు... బంధువులు దూరమయ్యారు... ఇరుగు పొరుగుతోనూ పలకరింపుల్లేవు... ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో భర్త మృతిచెందారు.

Updated : 30 May 2023 06:53 IST

అయినవాళ్లు లేరని ఓ మహిళ తొందరపాటు
పత్తికొండలో హృదయ విదారక ఘటన
మానసిక స్థితి సరిగా లేదన్న పోలీసులు

పత్తికొండ, పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: కుమారులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు... బంధువులు దూరమయ్యారు... ఇరుగు పొరుగుతోనూ పలకరింపుల్లేవు... ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో భర్త మృతిచెందారు. అంత్యక్రియలకు ఆ నలుగురు రారని భావించిందామె. భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసింది. ఈ దయనీయ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. పత్తికొండకు చెందిన హరిప్రసాద్‌, లలిత దంపతులు స్థానికంగా మెడికల్‌ షాపు నిర్వహించే వారు. హరిప్రసాద్‌ అనార్యోగం కారణంగా ఆరు నెలల కిందట దుకాణాన్ని మూసివేశారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు జయేశ్‌ వైద్యుడు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ముకేశ్‌ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. హరిప్రసాద్‌ 2016లో పక్షవాతానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మృతిచెందారు. తన భర్త చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగుకు చెప్పినా... వారెవరూ అంత్యక్రియలకు సహకరించరని లలిత భావించింది. దీంతో ఇంటి వెనుక ఆవరణలోకి మృతదేహాన్ని లాక్కెళ్లి పాత దుస్తులు, పాత పుస్తకాలు, అట్ట పెట్టెలు, ఇతర వస్తువుల్ని వేసి దహనం చేసింది. ఇంట్లోనుంచి పెద్దఎత్తున పొగలు వస్తుండటంతో స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోయిన మృతదేహం వారికి కనిపించింది. ఎనిమిదేళ్లుగా మంచంపై ఉన్న భర్తకు సేవలు చేస్తున్న లలితకు ఆరు నెలలుగా మానసిక పరిస్థితి బాగా లేదని స్థానికులు చెప్పారు.

మానసికంగా కుంగిపోయి...

లలిత కుటుంబానికి ఆర్థిక సమస్యలు లేవు. హరిప్రసాద్‌ అనారోగ్యానికి గురికావడం, కుమారులు అందుబాటులో లేకపోవడంతో ఒంటరి అయ్యామని భావించారు. ఇద్దరే ఆ ఇంట్లో ఉంటూ దిక్కుతోచని స్థితిలో కాలం గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త మృతిచెందడంతో ఆమె మానసికంగా మరింతగా కుంగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని