ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే నెపంతో గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన తెదేపా సానుభూతిపరుడు కరణం ప్రభాకర్‌ను అతని ఇంటి వద్ద వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.

Updated : 07 Jun 2023 08:16 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే నెపంతో గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన తెదేపా సానుభూతిపరుడు కరణం ప్రభాకర్‌ను అతని ఇంటి వద్ద వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వేళ వెంట తీసుకెళ్లిన పోలీసులు.. పలుచోట్ల తిప్పి రాత్రి 41ఎ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. ప్రైవేటు వాహనంలో మఫ్టీలో ప్రభాకర్‌ ఇంటికి వచ్చిన పోలీసులు వెంటనే సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. వివరాలు చెప్పకుండానే వెంట తీసుకెళ్లడంతో వచ్చిన వారెవరు? ఎక్కడికి తరలించారు? ఏం చేస్తారన్న ఆందోళనతో కుటుంబసభ్యులు తొలుత ఆందోళన చెందారు. తెదేపా నాయకులు ఆరా తీయగా, ప్రభాకర్‌ నగరంపాలెం స్టేషన్‌ వద్ద ఉన్నట్లు తేలింది. న్యాయవాదులతో సహా అక్కడికి చేరుకున్న నాయకులు.. ఆందోళనకు దిగారు. సమాచారమివ్వకుండా ఎలా తీసుకెళ్తారు? ప్రైవేటు వాహనంలో ఎందుకు వచ్చారు? మఫ్టీలో వచ్చినవారు పోలీసులేనా? అని న్యాయవాదులు సీఐని ప్రశ్నించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పులివెందుల పోలీసులను తిరిగి స్టేషన్‌కు రప్పించి ప్రభాకర్‌ను విడిచి పెట్టారు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని నగరంపాలెం పోలీసుల సమక్షంలోనే తెలియజేసి ఆ మేరకు నోటీసు ఇచ్చారు. అనంతరం పులివెందుల పోలీసులు వెనుదిరిగారు.

ఫిబ్రవరిలో కేసు నమోదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రభాకర్‌ పోస్టులు పెట్టారనే సమాచారంతో వైయస్‌ఆర్‌ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డిపల్లికి చెందిన వి.రవీంద్రరెడ్డి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఎ, 295ఎ, 505, 509, 120 బీ, 66ఈ, 67ఏ సహా ఐటీ యాక్టు కింద యువకుడిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో కేబుల్‌ వర్క్‌ పనులు చేసుకునే ప్రభాకర్‌.. తెదేపాలో సామాన్య కార్యకర్త. అతన్ని పట్టుకెళ్లే సమయంలో గర్భిణిగా ఉన్న సోదరి పోలీసులకు అడ్డుపడితే.. ఆమెను తోసేశారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు.

ప్రభాకర్‌ కుటుంబసభ్యులతో కలిసి నగరంపాలెం స్టేషన్‌ వద్దకు వెళ్లిన గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ.. ఆ యువకుడు పెట్టిన పోస్టులేంటి? అంటూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ప్రభాకర్‌ ఠాణా వద్దే ఓ ప్రైవేటు వాహనంలో కూర్చొని ఉండడం చూసి ఫొటోలు తీశారు. వాటిని పోలీసులు తొలగించి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని