కుమార్తె అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య

ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆవేదన చెంది ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలారు.

Updated : 17 Jul 2021 06:55 IST

ఠాణాలోనే కుప్పకూలిన వైనం..

పర్వతగిరి, న్యూస్‌టుడే: ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆవేదన చెంది ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన ఆ రైతుకు ఇంటర్‌ చదువుతున్న కుమారుడితో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె (15) ఉన్నారు. ఆమె ఈనెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో 8వ తేదీన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు బాలిక తల్లిదండ్రుల కాల్‌డేటాను పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్‌కు చెందిన బాలుడు, ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలుడితో బాలిక మాట్లాడినట్లు గుర్తించారు. కేసు విచారణలో ఉండడం, పది రోజులు గడుస్తున్నా కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో గొడవపడిన నాగరాజు పురుగుమందు తాగి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. న్యాయం చేయండీ.. అంటూ స్టేషన్‌లోనే కుప్పకూలిపోయారు. పోలీసులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన మృతిచెందారు. ఈ విషయంపై పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ బాలిక అదృశ్యంపై ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదుచేసి సామాజిక మాధ్యమాల ఆధారంగా విచారణ చేపట్టామని చెప్పారు. నాగరాజు పురుగుమందు తాగి స్టేషన్‌కు వచ్చాడని, కేసు విషయమై మాట్లాడుతుండగానే ఆయన నేలకొరిగినట్లు వివరించారు. భర్త మృతిచెందినట్లు భార్య విజయ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని