దళిత బాలికపై అత్యాచారంలో కొత్తకోణం

గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలికను...

Updated : 21 Aug 2021 06:23 IST

అఘాయిత్యానికి తెగబడింది వరుసకు మామయ్యే

పిల్లలతో ఆడుకోవడానికి పిలిచి.. నోట్లో గుడ్డలు కుక్కి ఘోరం

వివరాలు వెల్లడించిన గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలికను... ఆమెకు వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి తన పిల్లలతో ఆడుకోవడానికి పిలిచి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ మానవ మృగాన్ని పోలీసులు అరెస్టుచేశారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ శుక్రవారం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు.

రాజుపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ దళిత బాలిక కొంతకాలంగా ఆస్థమా, కిడ్నీ సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు. బాలిక చిన్నతనం నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద రాజుపాలెంలో పెరిగింది. అక్కడకు సమీపంలో నివసించే దూరపు బంధువు, వరుసకు మామయ్య అయ్యే గల్లా లాబాన్‌ ఆ బాలికను తరచూ పలకరించేవాడు. అతడికి పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. బాలిక అతడి పిల్లలతో ఆడుకునేది. కొద్దిరోజుల క్రితం బాలిక అమ్మమ్మ మృతిచెందింది. ఈ నెల 18న ఆమె పెద్దకర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ ఆ హడావిడిలో ఉండగా లాబాన్‌ ఆ బాలికను తన పిల్లలతో ఆడుకోవడానికి పిలిచాడు. ఎప్పటిలాగే వెళ్లిన ఆమెను.. గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. అరుపులు, కేకలు ఎవరికీ వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు.

బాధను దిగమింగుకొని...

అకృత్యాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని బాధను దిగమింగుకొని కుమిలిపోయారు తప్ప, పోలీసు కేసు పెట్టలేదు. స్థానికులు, మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వెంటనే కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. దిశ డీఎస్పీ రవిచంద్ర, పిడుగురాళ్ల రూరల్‌ సీఐ పి.వీరాంజనేయులు, ఎస్సై అమీర్‌, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లారు. బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేయగా, వాళ్లు 19వ తేదీ మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న రెండు గంటల్లోనే నిందితుడు గల్లా లాబాన్‌ను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్పీ తెలిపారు.


నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు

ఈ ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని రూరల్‌ ఎస్పీ తెలిపారు. లాబాన్‌ 20 రోజుల క్రితమే ఆ బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు తెలిసిందని చెప్పారు. అతడితో పాటు సంజీవ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. బాలికపై అత్యాచారం జరిగినప్పుడు అదే ఇంటివద్ద సంజీవ్‌ కనిపించడంతో బాలిక బంధువులు ఇద్దరూ కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టారని అనుమానించారని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు సంజీవ్‌కు సంబంధం లేదని తెలిసిందన్నారు. అయినా ఏ1గా లాబాన్‌, ఏ2గా సంజీవ్‌ పేర్లు చేర్చినట్లు చెప్పారు. ఇద్దరి డీఎన్‌ఏను పరీక్షలకు పంపిస్తున్నట్లు తెలిపారు. రోజుల్లోగా ఛార్జిషీట్‌ నమోదు చేయడమే కాకుండా శాస్త్రీయ ఆధారాలు సేకరించి నిందితునికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు చేసి రెండు గంటల్లో నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని