Maldives: మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక

Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది.

Published : 26 Apr 2024 18:57 IST

మాలె: భారత్‌ (India)తో దౌత్య విభేదాల వేళ మాల్దీవులు (Maldives) చైనా (China)కు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్‌ పరిశోధక నౌక (research ship) ఒకటి కొన్నిరోజుల పాటు ఈ దీవుల జలాల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన పరిశోధక నౌక ‘షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03’ గురువారం ఉదయం తిలాఫుషీ ఇండస్ట్రియల్‌ హార్బర్‌లో లంగరేసినట్లు స్థానిక మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి. అయితే, ఈ నౌక ఎందుకు తిరిగొచ్చిందన్న విషయాన్ని ముయిజ్జు సర్కారు వెల్లడించలేదు.

దాదాపు 4,500 టన్నుల బరువున్న ఈ పరిశోధక నౌక.. ఈ ఏడాది జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయల్దేరింది. దాదాపు నెల రోజుల పాటు మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ సరిహద్దుల్లో తిరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న తిలాఫుషీ పోర్టుకు చేరుకుని దాదాపు వారం రోజుల తర్వాత అక్కడినుంచి తిరిగెళ్లింది. దాదాపు రెండు నెలల పాటు పలు పోర్టులకు వెళ్లిన ఈ నౌక ఇప్పుడు మళ్లీ మాల్దీవులు తీరానికి చేరుకుంది.

అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్‌

అంతకుముందు ఈ నౌక మాలె తీరానికి వచ్చిన విషయాన్ని మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి ధ్రువీకరించారు. సిబ్బంది రొటేషన్‌ కోసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన మేరకు దాన్ని అనుమతించినట్లు తెలిపారు. అయితే, ఇక్కడ ఉన్నప్పుడు ఆ నౌక ఎలాంటి పరిశోధన కార్యకలాపాలు నిర్వహించదని చెప్పారు.

ఈ నౌక చైనాలోని థర్డ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్రగర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని డ్రాగన్‌ గతంలో వెల్లడించింది.  గతంలో ఇదేతరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్యకలాపాలు నిర్వహించాయి. ఇవి జలాల్లో మాత్రమే పరిశోధనలు చేస్తాయని చైనా చెబుతున్నా.. భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగనతలంపై నిఘా ఉంచగలవనే ఆరోపణలున్నాయి. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ నౌక ఉన్న మాల్దీవుల ప్రాంతం భారత్‌లోని లక్షద్వీప్‌లో గల మినికోయి ద్వీపానికి కేవలం 70 నాటికల్‌ మైళ్ల దూరంలోనే ఉంది. దీంతో దీని కదలికల్ని భారత నేవీ అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అయితే, తాజా రాకపై మన నౌకాదళం ఇంకా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని