Andhra News: ‘మహాప్రస్థానం’ లేక మహా విషాదం!

మహాప్రస్థానం వాహనం లేక, ప్రైవేటు వాహనాలకు ఇచ్చుకునేంత ఆర్థిక స్థోమతలేక ఓ తండ్రి తన చిన్నారి కుమార్తె మృతదేహాన్ని భుజంపై వేసుకొని ద్విచక్రవాహనంపై సొంతూరుకు తీసుకెళ్లాడు.

Updated : 07 May 2022 09:19 IST

ద్విచక్ర వాహనంపై కుమార్తె మృతదేహం తరలించిన తండ్రి

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: మహాప్రస్థానం వాహనం లేక, ప్రైవేటు వాహనాలకు ఇచ్చుకునేంత ఆర్థిక స్థోమతలేక ఓ తండ్రి తన చిన్నారి కుమార్తె మృతదేహాన్ని భుజంపై వేసుకొని ద్విచక్రవాహనంపై సొంతూరుకు తీసుకెళ్లాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లికి చెందిన చిన్నారి అక్షయ(3) గురువారం గ్రామంలో చెరువుగుంతలో పడి అపస్మారకస్థితికి చేరుకొంది. 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఆమె తండ్రి శ్రీనివాసులు 108 సిబ్బందిని ప్రాధేయపడ్డారు. మృతదేహాలను తరలించేందుకు అనుమతి లేదని వారు నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్సులో తీసుకొచ్చేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడం, ఆటోడ్రైవర్లు నిరాకరించడం, ఆసుపత్రిలోనూ మహాప్రస్థానం వాహనం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యుల సహకారంతో కుమార్తె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా హెల్త్‌ కోఆర్డినేటరు విద్యాసాయి, నాయుడుపేట సీఐ సోమయ్య, తహసీల్దారు గోపినాథ్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సిబ్బంది శుక్రవారం కొత్తపల్లి గిరిజన కాలనీకి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని