icon icon icon
icon icon icon

PM Modi: వైకాపాకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ వికాసమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

Updated : 08 May 2024 17:38 IST

పీలేరు: ఆంధ్రప్రదేశ్‌ వికాసమే తన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ.. ఈ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత ఉందన్నారు.

‘‘రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవు, యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైకాపా మోసం చేసింది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. పేదల వికాసం కోసం కాదు.. మాఫియా వికాసం కోసం వైకాపా పనిచేసింది. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయింది. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తాం. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్‌ మిషన్‌కు వైకాపా ప్రభుత్వం సహకారం అందించలేదు. ఐదేళ్లుగా రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. 

ఎన్డీయే ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటాం. గల్ఫ్‌కు వెళ్లే భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగింది. ఖతార్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా రప్పించాం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదు. అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. భారత్‌.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. అధికారం కోసం ఆ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోంది. 

దక్షిణాదిలో బుల్లెట్‌ ట్రైన్‌ నడుపుతాం..

బల్లెట్‌ ట్రైన్‌ కావాలా? వద్దా? దక్షిణాదిలో కూడా బుల్లెట్‌ రైలు కావాలని భాజపా కోరుకుంటోంది. నంద్యాల-ఎర్రకుంట్ల రైల్వే లైన్‌ పనులు పూర్తయ్యాయి. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ మంజూరైంది. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ నిర్మాణంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తాం. రైతుల జీవితాన్ని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే మార్చగలుగుతుంది. రాయలసీమలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img