Telangana News: నిన్న మిస్సింగ్‌.. నేడు విగతజీవిగా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య?

యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్‌ విగతజీవిగా మారారు. ఆయన మృతదేహం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Updated : 17 Apr 2022 17:32 IST

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్‌ విగతజీవిగా మారారు. ఆయన మృతదేహం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రామకృష్ణది రియల్‌ ఎస్టేట్‌ గొడవలతో జరిగిన హత్యా?పరువు హత్యా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లెకు చెందిన రామకృష్ణ గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డుగా పనిచేశారు. గుప్తనిధుల కేసులో ఆయన సస్పెండ్‌ అయ్యారు. రెండేళ్ల క్రితం రామకృష్ణకు గౌరాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె భార్గవితో పరిచయం ఏర్పడింది. 2020లో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో భార్గవి తల్లిదండ్రులకు ఆ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్గవి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ రామకృష్ణతోనే ఉంటానని.. తన తండ్రి ఆస్తిలో వాటా అడగనని తెలిపింది. తన తండ్రి ఆస్తిలో వాటా కూడా అడగనంటూ ఓ పత్రంపై రాసిచ్చినట్లు మీడియాకు ఆమె వెల్లడించింది.

8 నెలల క్రితం భువనగిరి పట్టణంలో రామకృష్ణ, భార్గవి ఇద్దరూ గది అద్దెకు తీసుకుని అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు. రామకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే లతీఫ్‌ అనే వ్యక్తితో రామకృష్ణ ఇంటి నుంచి వెళ్లినట్లు భార్గవి తెలిపారు. శనివారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రామకృష్ణ మృతదేహాన్ని కొండపాక మండలం లక్డారం వద్ద గుర్తించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని