Aryan Khan: ఆర్యన్‌కు కస్టడీ పొడిగించండి: ఎన్సీబీ వాదనలు

గోవా నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ సహా పలువురు నిందితుల కస్టడీ ముగియడంతో ఎన్సీబీ అధికారులు గురువారం కోర్టులో.........

Updated : 07 Oct 2021 18:06 IST

ముంబయి:  గోవా నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కస్టడీ పొడిగించాలని ఎన్సీబీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆర్యన్‌ సహా పలువురు నిందితులకు ఇటీవల కోర్టు విధించిన కస్టడీ నేటితో ముగియడంతో ఎన్సీబీ అధికారులు గురువారం వీరందరినీ ముంబయి సిటీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 11వరకు ఆర్యన్‌ సహా అర్బాజ్‌, దమేచాల రిమాండ్‌ను పొడిగించాలని ఎన్సీబీ తరఫు న్యాయవాదులు కోరారు. క్రూజ్‌ నౌకలో రేవ్‌ పార్టీ నేపథ్యంలో ఇటీవల ఎన్సీబీ అధికారులు దాడులు జరిపి ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో మొత్తంగా ఇప్పటివరకు 17మందిని అరెస్టు చేసినట్టు ముంబయి సిటీ కోర్టుకు ఎన్సీబీ వెల్లడించింది. 

ఆర్యన్‌ను కలిసిన షారుక్‌ మేనేజర్‌!

మరోవైపు, ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ను అధికారులు కోర్టుకు తీసుకురాగా.. అక్కడ షారుక్‌ ఖాన్‌ మేనేజర్‌ ఆయన్ను కలిశారు. కోర్టు బయట ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న ఆర్యన్‌తో మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు, మూన్‌మూన్‌ దమేచా కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు అధికారుల అనుమతి కోరారు. ఆర్యన్‌ఖాన్‌ చెప్పిన వివరాల ఆధారంగా అచిత్‌ కుమార్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. అర్బాజ్‌ కూడా అతడి పేరును చెప్పినట్టు పేర్కొన్న అధికారులు.. ఆచిత్‌ కుమార్ కస్టడీని కూడా పొడిగించాలని కోర్టును కోరగా.. ఈ నెల 9వరకు అతడిని ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం ఇంకొంత సమయం అవసరమని అధికారులు కోర్టుకు చెప్పినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని