స్వగ్రామం వస్తూ జవాను మృతి.. విషయం తెలిసి గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం

సెలవుపై స్వగ్రామం వస్తున్న ఓ జవాను ప్రమాదవశాత్తూ మృతి చెందగా ఈ విషయం తెలిసిన కొద్దిసేపటికే నిండు గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనిది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేటకు చెందిన కురువ నాగప్ప, భీమక్క దంపతులకు ఇద్దరు కుమారులు.

Updated : 10 Oct 2021 07:00 IST

నందవరం, న్యూస్‌టుడే: సెలవుపై స్వగ్రామం వస్తున్న ఓ జవాను ప్రమాదవశాత్తూ మృతి చెందగా ఈ విషయం తెలిసిన కొద్దిసేపటికే నిండు గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనిది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేటకు చెందిన కురువ నాగప్ప, భీమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోహర్‌ (29) పదేళ్ల కిందట సైన్యంలో చేరారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం జవానుగా పనిచేస్తున్నారు. సెలవుపై శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఓ స్టేషన్‌లో రైలు దిగి తిరిగి ఎక్కే క్రమంలో కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన రమాదేవితో మూడేళ్ల కిందట అతడికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. భర్త రాక కోసం పుట్టింట్లో ఉంటూ ఎదురుచూస్తున్న ఆమె ఆ విషాద వార్తను జీర్ణించుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని