రెమిడెసివర్‌ అక్రమ అమ్మకాల గుట్టురట్టు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెమిడెసివిర్‌ ఔషధాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి

Published : 13 May 2021 01:37 IST

ఏలూరు నేరవార్తలు: కొవిడ్‌ రోగులకు ఉపయోగించే రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లను అక్రమంగా బయట అధిక ధరలకు విక్రయిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 13 రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లను, రూ.40వేల నగదును, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ వద్ద బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ వివరాలు వెల్లడించారు.

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ట్రామాకేర్‌లో పని చేసే ఓ టెక్నీషియన్‌ రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లను పక్కదారి పట్టించి కొంతమందికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు 3బృందాలు ఏర్పాటు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న రాయల వెంకటలక్ష్మి, మరో స్టాఫ్‌ నర్సు లావణ్య, ట్రామాకేర్‌ టెక్నీషియన్‌ బి.రవిబ్రహ్మయ్య, వీరితోపాటు వివిధ మెడికల్ స్టోర్లలో పని చేస్తున్న వారు, మెడికల్‌ రిప్‌లుగా పని చేస్తున్నవారు మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కీలక నిందితులు మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. టూటౌన్‌ సీఐ ఆదిప్రసాద్‌, ఎస్సైలు కిశోర్‌ బాబు, నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని