TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల నగ్న దృశ్యాలు

టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళలే నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. 

Updated : 14 Mar 2023 14:08 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రవీణ్‌ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌ విభాగానికి వచ్చే మహిళల చరవాణి నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు. 

పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈనెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలకు సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. నిందితుడు ప్రవీణ్‌ నుంచి పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న మరో నలుగురు అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని