Eluru: వసతిగృహంలో బాలుడిని చంపిన ఇద్దరు పదోతరగతి విద్యార్థులు అరెస్టు

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వసతిగృహం విద్యార్థి హత్యకేసును పోలీసులు ఛేదించారు.

Published : 13 Jul 2023 19:46 IST

బుట్టాయగూడెం: ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వసతిగృహం విద్యార్థి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో ఈనెల 10న నాలుగోతరగతి విద్యార్థి అఖిల్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు పదోతరగతి విద్యార్థులే దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు జువైనల్‌ హోమ్‌కు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఏలూరు జిల్లా డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరూ అదే పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు.

ఆందోళనలో వసతి గృహం విద్యార్థులు...

మన్యంలోని మారుమూల గ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వాలంటీరు, భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆరో తరగతి, అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) నాలుగో తరగతి పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ వసతిగృహంలో చదువుతున్నారు. సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా ఇద్దరు ఆగంతుకులు వసతిగృహం లోపలికి ప్రవేశించారు. విద్యుత్తు సరఫరా నిలిపివేసి, అఖిల్‌వర్ధన్‌రెడ్డిని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లారు. బాలుణ్ని హత్య చేసి, దగ్గరలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. పీక నొక్కి, కళ్లపై గుద్ది చంపినట్లు మృతదేహంపై ఆనవాళ్లు ఉన్నాయి. ‘బతకాలనుకున్న వారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లు మీ ×××’ అని రాసి ఉన్న లేఖను బాలుడి చేతిలో పెట్టారు. తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..క్లూస్‌ టీమ్‌ సాయంతో నిందితులను గుర్తించారు. అఖిల్‌ హత్యకుగురవడంతో వసతి గృహం విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని