Neom: భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!

సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్‌ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్‌ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. 

Updated : 09 May 2024 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్‌’(Neom)కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా (Saudi Arabia) ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే అస్సలు కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ బీబీసీ సంస్థకు వెల్లడించారు. ఆయన గతేడాది యూకేకు శరణుకోరి వచ్చారు. తాజాగా నియోమ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో వెల్లడించారు.

అసలేమిటీ నియోమ్‌.. 

సౌదీ అరేబియాలో పెట్రోల్‌ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచం కూడా చమురు నుంచి గ్రీన్‌ ఎనర్జీ వైపు వేగంగా మళ్లుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సౌదీ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడి పాలకులు దేశాన్ని పర్యాటక ప్రదేశం, గ్లోబల్‌ హబ్‌గా తీర్చి దిద్దేలా చేపట్టిందే ‘నియోమ్‌’ స్మార్ట్‌ సిటీ. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మానసపుత్రికగా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు. దీనికి 500 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లను నిర్మించనున్నారు. వీటిల్లో ఫ్లోటింగ్‌ పోర్ట్‌, స్కై రిసార్ట్‌లు, సర్వాట్‌ పర్వతాలపై నిర్మాణాలు, మిర్రర్డ్‌ సిటీ వంటివి ఉన్నాయి. ఈ మొత్తంలో ‘ది లైన్‌’ పేరిట చేపట్టేది అత్యంత కీలకమైన నిర్మాణం. 

2026 నాటికి నియోమ్‌లో 4.5 లక్షల మంది జనాభా ఉంటారని అంచనావేస్తున్నారు. 2030 నాటికి ఇక్కడి జనాభా 20 లక్షలకు చేరుకోవచ్చు. ఇక ది లైన్‌ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చని చెబుతున్నారు. ఇక్కడ త్రీడీ కమ్యూనికేషన్లు ఉంటాయి. ప్రజలు కేవలం ఐదు నిమిషాలు నడిస్తే వారికి నిత్యావసరాలు దొరికేస్తాయి. కృత్రిమ మేధతో అందే సేవలు ఇక్కడ లభిస్తాయి. దీని నిర్మాణంలో అద్దాల వినియోగం చాలా ఎక్కువగా ఉండనుంది.

ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 100 శాతం పునరుత్పాదక ఇంధనం వినియోగించనున్నారు. జీరో ఉద్గారాలు, పాజిటివ్ కార్బన్‌ వాతావరణం ఉండేట్లు చూస్తారు. వర్చువల్‌ ఫార్మింగ్‌, గ్రీన్‌ హౌసెస్‌ల ద్వారా ఇక్కడ వాడే ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేయనున్నారు. స్థానిక సర్వత్‌ పర్వతాలపై నిర్మిస్తున్న ట్రోజెనాలో 2029 ఆసియా వింటర్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. 

‘ది లైన్‌’ ప్రాజెక్టు కోసం..

వాస్తవానికి ది లైన్‌ ప్రాజెక్టు 2030 నాటికి కేవలం 2.4 కిలోమీటర్ల మేరకే నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలున్నాయి. దీని పనుల్లో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం. దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు 2020లో సౌదీ బలగాలు తీవ్రంగా యత్నించి విజయం సాధించాయి. ఇక్కడి ప్రజలు హువైటీ తెగకు చెందినవారు. అప్పట్లో అబ్దుల్‌ రహీం అల్‌ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. దీంతో అతడిని మర్నాడే దళాలు కాల్చేశాయి. ఆ తర్వాత జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్ర నేరాలపై అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించారు. హువైటీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ విషయాలు బహిర్గతం చేసిన కర్నల్‌ ఎలెన్జీ  కూడా భయపడుతున్నారు. ఇటీవల ఓ సౌదీ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ తనను లండన్‌లోని దౌత్యకార్యాలయానికి రమ్మని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. తాను దానికి నిరాకరించినట్లు చెప్పారు. నియోమ్‌ ప్రాజెక్టుకు ఎవరు అడ్డు వచ్చినా ఎంబీఎస్‌ ఏమాత్రం సహించే పరిస్థితి లేదని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని