logo

ఆగిన సీఎంఆర్‌ బియ్యం

‘జిల్లాలోని ధాన్యం మిల్లుల యజమానులు సీఎంఆర్‌ బియ్యం(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) వెంటనే సరఫరా చేయాలి. ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం..!’

Updated : 19 Jan 2023 06:31 IST

ఫోర్టిఫైడ్‌ గింజలు సరఫరా ఏదీ..?

రెండు రోజులుగా ధాన్యం మిల్లుల మూత

ఈనాడు, అమరావతి

‘జిల్లాలోని ధాన్యం మిల్లుల యజమానులు సీఎంఆర్‌ బియ్యం(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) వెంటనే సరఫరా చేయాలి. ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం..!’

జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో రెండు జిల్లాల సంయుక్త కలెక్టర్ల హెచ్చరిక ఇది..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత రెండు రోజులుగా ధాన్యం మిల్లులు నిలిచిపోయాయి. అధికారుల తీరుతో రెండు రోజులుగా ధాన్యం మర పట్టడం లేదు. ఒకవైపు లక్ష్యాలు, గడువు నిర్దేశించిన అధికారులు దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం లేదు. సీజన్‌లో మిల్లులు నిలిచిపోవడం వల్ల తాము నష్టపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం పౌరసరఫరాల సంస్థ నుంచి ఫోర్టిఫైడ్‌ (పోషక విలువలు కలిగిన) బియ్యం అందకపోవడమే. గత కొన్ని రోజులుగా మిల్లర్లకు ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేయడంలో కార్పొరేషన్‌ విఫలమైంది.

భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సరఫరా చేసే బియ్యం ఫోర్టిఫైడ్‌ మాత్రమే ఉండాలని ఈ ఏడాది నిబంధన విధించారు. గతంలో సార్టెక్సు బియ్యం తీసుకునేవారు. కానీ ప్రస్తుతం ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే తీసుకుంటున్నారు. వీటినే ప్రభుత్వం అన్ని అవసరాలకు సరఫరా చేయనుంది. గతంలో కేవలం మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీలకు మాత్రమే ఈ బలవర్థక పోషకాహార విలువలు ఉన్న ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేసేవి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, రాష్ట్రం సరఫరా చేసే పీడీఎస్‌ బియ్యం అన్నీ ఫోర్టిఫైడ్‌ ఇవ్వనున్నారు. దీనికి బియ్యంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం గింజలను కలుపుతారు. ఇవి ప్రభుత్వ పౌరసరఫరాల సంస్థ ద్వారా మిల్లర్లకు అందించాల్సి ఉంది. ఇవి లేకపోవడంతో మిల్లర్లు సీఎంఆర్‌ మిల్లింగ్‌ నిలిపివేశారు.

తయారీ ఇలా...

ఫోర్టిఫైడ్‌ బియ్యం గింజలను మొదట నాఫెడ్‌ సరఫరా చేసేది. తర్వాత పౌరసరఫరాల సంస్థ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌, హరియాణా నుంచి ఇవి రావాల్సి ఉంది. బియ్యం నూకను పిండిగా మార్చుతారు. వీటికి ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, జింక్‌ లాంటి పోషకాలను నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం కలుపుతారు. ఇలా తయారైన పిండిని ఉడికించి ప్రత్యేకంగా ఉన్న మిల్లుల్లో బియ్యం గింజ ఆకారంలోకి మార్చుతారు. ఇలా వచ్చిన వాటిని ఫోర్టిఫైడ్‌ గింజలుగా పిలుస్తారు. మన రాష్ట్రంలో కాకినాడలో ఈ తరహా మిల్లు ఉంది. ఇలా తయారైన బియ్యం గింజలను సాధారణ బియ్యంలో క్వింటాకు కేజీ చొప్పున కలిపి ప్యాకింగ్‌ చేయాల్సి  ఉంటుంది. వీటిని ఫోర్టిఫైడ్‌ బియ్యంగా సరఫరా చేస్తున్నారు. వీటిని కొంతమంది ప్లాస్టిక్‌ బియ్యంగా అనుమానిస్తున్నారు. ఎక్కువగా కలిస్తే సమస్య ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్‌సీఐ, రాష్ట్ర కార్పొరేషన్‌ వీటినే సీఎంఆర్‌గా తీసుకుంటుంది.

* కృష్ణా జిల్లాలో మొత్తం సీఎంఆర్‌ కింద దాదాపు 2.60లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం ఇవ్వాల్సి ఉంది. టన్నుకు 10కేజీల వరకు ఫోర్టిఫైడ్‌ గింజనలు మిక్స్‌ చేసి సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు జిల్లాలో నిలువ లేవు.

* ఎన్టీఆర్‌ జిల్లాలో 1.20లక్షల టన్ను ధాన్యం సేకరణ. అంటే దాదాపు 60వేల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సరఫరా లేవు.

* కృష్ణా జిల్లాలో 145 మిల్లులకు ప్రభుత్వం సేకరించిన ధాన్యం సరఫరా చేస్తోంది. గత రెండు రోజులుగా మిల్లులు ఆడటం లేదు. ఫోర్టిఫైడ్‌ గింజల సరఫరా లేకపోవడంతో బియ్యం మిల్లులో ఉండిపోయాయని యజమాని ఒకరు చెప్పారు. ఎన్నిరోజులకు సరఫరా చేస్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

* ఎన్టీఆర్‌ జిల్లాలో 19 మిల్లులు ఉన్నాయి. మిల్లుల్లో ధాన్యం నిలువలు పేరుకుపోయాయి. బియ్యం ప్యాకింగ్‌ చేసి ఎఫ్‌సీఐకు అందిస్తేనే  కొత్తగా మిల్లు ఆడించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* మరోవైపు రెండు జిల్లాల్లోనూ సేకరించాల్సిన ధాన్యం భారీగా ఉంది. ఉత్పత్తి ఎక్కువగా రావడంతో ఇంకా కల్లాల మీద ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని