logo

వీరమ్మతల్లి తిరునాళ్లు.. భక్తజన పరవళ్లు

కృష్ణా జిల్లాలో ఖ్యాతిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారథి మెట్టినింటి నుంచి పూజలు నిర్వహించి రాత్రి 9.50 గంటలకు అమ్మవారిని వెలుపలకు తీసుకువచ్చారు

Updated : 01 Feb 2023 07:03 IST

పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళుతున్న పట్టణ ఎస్‌ఐ వీరకుమార్‌ దంపతులు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాలో ఖ్యాతిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారథి మెట్టినింటి నుంచి పూజలు నిర్వహించి రాత్రి 9.50 గంటలకు అమ్మవారిని వెలుపలకు తీసుకువచ్చారు. మెట్టినింటి ఆలయ వెలుపల పూజలు చేసిన తర్వాత అమ్మవారిని పల్లకి ఎక్కించారు. అమ్మవారు బయటకు వచ్చే సమయంలో వేలాది భక్తజనం ఎదురు గండ దీపాలతో మొక్కులు తీర్చుకున్నారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సంఘాలు, సేవా సంస్థలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండే భక్తులకు ఫలహారాలు, పాలు, మజ్జిగ అందించాయి. పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు.

పోలీసుస్టేషన్లో పూజలు: సంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారికి తొలిసారిగా పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను ఉయ్యూరు పట్టణ ఎస్‌ఐ వీరకుమార్‌ దంపతులు సమర్పించారు. పోలీసు సిబ్బంది, అధికారుల కుటుంబీకులు, సీఐ పరమేశ్వర్‌ పాల్గొన్నారు.
భారీగా బందోబస్తు: తిరునాళ్ల 15 రోజులూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా డీఎస్పీ  విజయ్‌పాల్‌ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఏఎస్‌ఐలు, 256 మంది పోలీసు సిబ్బంది బందోబస్సుకు నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని