logo

Secunderabad-Howrah: తిరిగి వెళ్లేదెలా..?ప్రత్యేక రైళ్లు సహా అన్నీ ఫుల్‌

సంక్రాంతి సెలవుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చిన వారికి తిరుగు ప్రయాణ కష్టాలు ఎక్కువయ్యాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, హౌరా రూట్‌లో నడిచే రైళ్లలోని టిక్కెట్లు ఆది, సోమవారాల్లో

Updated : 15 Jan 2022 08:54 IST

సికింద్రాబాద్‌, హౌరా మార్గాల్లో కష్టాలు

ఈనాడు, అమరావతి

సంక్రాంతి సెలవుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చిన వారికి తిరుగు ప్రయాణ కష్టాలు ఎక్కువయ్యాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, హౌరా రూట్‌లో నడిచే రైళ్లలోని టిక్కెట్లు ఆది, సోమవారాల్లో నిండాయి. చాలా రైళ్లలో 300కు పైగానే సాధారణ ప్రయాణికుల వెయిటింగ్‌ జాబితా ఉంటోంది. ప్రత్యేక రైళ్లను ఆన్‌లైన్‌లో పెట్టిన వెంటనే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అయిపోతున్నాయి. సువిధ స్పెషల్‌ లాంటి అధిక ధర ఉండే రైళ్లలో మాత్రం థర్డ్‌ ఏసీ పైన టిక్కెట్లు కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. ఈ రైలులో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు థర్డ్‌ ఏసీ ధర రూ.3080 ఉంది. సంక్రాంతి సెలవులకు వచ్చేవారిలో ఎక్కువ మంది తిరిగి కార్యాలయాలకు వెళ్లేందుకు ఆదివారం రాత్రి లేదంటే సోమవారం తిరుగు ప్రయాణాలు అవుతారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా రోజుకు 2లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ మీదుగా సాధారణ రైళ్లు నిత్యం 200కు పైగా నడుస్తుండగా.. ప్రస్తుతం పండగ స్పెషల్‌గా మరో 70 వరకు వేశారు. ఎక్కువ రైళ్లు విశాఖ, సికింద్రాబాద్‌ నుంచి ఆరంభమై.. విజయవాడ మీదుగా వెళ్తున్నవే ఉన్నాయి. ఈసారి విజయవాడ నుంచి వేసిన ప్రత్యేక రైళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. బయట నుంచి వచ్చే రైళ్లలోని కోటాపైనే ప్రయాణికులు ఎక్కువ ఆధారపడుతున్నారు. కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో ఈసారి పండుగ ప్రయాణాలు తక్కువ ఉంటాయని భావించినా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఆదివారం సాయంత్రం నుంచి విజయవాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్లు నిండిపోయి వెయిటింగ్‌ జాబితా పెరిగిపోయింది. శని, ఆదివారాలు సెలవులు కలిసి రావడంతో ఎక్కువ మంది రెండు రోజులు పండుగ కోసం వచ్చారు. వాళ్లు తిరిగి.. సోమవారం ఉదయానికి కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఆదివారం రాత్రి ఎక్కువ మంది బయలుదేరి వెళతారు. ఆదివారం ఉదయం మాత్రం కొన్ని రైళ్లలో ఖాళీలు ఉన్నాయి.

* విజయవాడ డివిజన్‌ పరిధిలో.. సంక్రాంతి సందర్భంగా విజయవాడ డివిజన్‌ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్ల మధ్యలో ఈసారి 46 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈనెల 20వ తేదీ వరకూ వీటిలో చాలా రైళ్లు నడుస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ నుంచి వీటిలో ఎక్కువగా ఆరంభమవుతున్నాయి. నర్సాపూర్‌, రాజమండ్రి సహా పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. విజయవాడ- మచిలీపట్నం మధ్యలోనూ పలు రైళ్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని చిలకలపూడి, పెడన, వడ్లమన్నాడు, కౌతవరం, గుడ్లవల్లేరు, గుడివాడ, తరిగొప్పుల, ఉప్పలూరు సహా చాలా స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. విజయవాడ నుంచి గుంటూరుకు కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని