logo

వేర్వేరు దాడుల్లో ఎర్రచందనం స్వాధీనం

టాస్క్‌ఫోర్స్‌ బలగాలు వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల పరిధిలో వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో రూ. 60 లక్షల విలువైన 62 దుంగలు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

Published : 04 Jun 2023 03:08 IST

ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్‌

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు చూపుతున్న అధికారులు

జీవకోన(తిరుపతి),న్యూస్‌టుడే: టాస్క్‌ఫోర్స్‌ బలగాలు వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల పరిధిలో వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో రూ. 60 లక్షల విలువైన 62 దుంగలు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. డీఎస్పీలు మురళీధర్‌, చెంచుబాబుల కథనం మేరకు.. శుక్రవారం మూడు బృందాలు వైయస్‌ఆర్‌ జిల్లా సిద్ధవటం, అన్నమయ్య జిల్లా రాజంపేట, తంబళ్లపల్లె ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించారు. రైల్వేకోడూరు సబ్‌కంట్రోల్‌ పాయింట్ ఆర్‌ఐ కృపానంద టీమ్‌, ఎఫ్‌ఆర్వో మౌనిక బృందంతో కలిసి వైయస్‌ఆర్‌ జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తూ ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వారు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన చిల్పం సాంబయ్య, యడమకంటి రమణయ్య, వైయస్‌ఆర్‌ జిల్లా కుంటగిరికి చెందిన ముద్దా నరసింహులు, ఖాజీపేటకు చెందిన నక్కా వెంకటేష్‌, బద్వేల్‌ టౌన్‌కు చెందిన వనం చెన్నయ్యగా గుర్తించారు. వీరి నుంచి 753 కిలోల బరువున్న 26 ఎర్రచందనం దుంగలను, ఒక మోటారు బైకును స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్సై వినోద్‌కుమార్‌కు చెందిన బలగాలు అన్నమయ్య జిల్లా పుల్లంపేట, తుమ్మలబైలు సెక్షన్‌లో కూంబింగ్‌ చేస్తుండగా కరుకు ప్రాంతంలో స్మగ్లర్లు 8 ఎర్రచందనం వదిలేసి పారిపోగా స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఐ చిరంజీవులు, ఆర్‌ఎస్సై పి.నరేష్‌ల ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలం, తంబళ్లపల్లి సెక్షన్‌ నుంచి కూంబింగ్‌ నిర్వహిస్తూ నాగలకుంట్ల పరిధి రామేశ్వరపురంలో రిటైర్డ్‌ ఫారెస్ట్‌ వాచర్‌ రాచకొండ రామయ్య ఇంట్లో అనుమానంతో సోదాలు చేయగా 28 ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మూడు ఘటనల్లో తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని