logo

జేఎన్‌టీయూకే బంగారాలు

కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవాలంటే కృషి, పట్టుదల అవసరం. ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న జేఎన్‌టీయూకే..

Published : 31 May 2023 04:57 IST

జేఎన్‌టీయూ (కాకినాడ), న్యూస్‌టుడే: కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవాలంటే కృషి, పట్టుదల అవసరం. ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న జేఎన్‌టీయూకే.. అందులోని ఆణిముత్యాలను విజేతలుగా తీర్చిదిద్దుతుంది. ఆ చదువులమ్మ చల్లని నీడలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి బంగారు పతకాలు సాధించిన వారు కొందరైతే.. సమాజంలోని సమస్యల పరిష్కారంపై పరిశోధనలు చేసి పట్టాలందుకున్న వారు మరికొందరు. నేడు జరగనున్న 9వ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందుకోనున్న కొందరు తమ
అభిప్రాయాలు పంచుకున్నారిలా..


ఇంటర్న్‌షిప్‌ చేయడం ఎంతో కీలకం..

నాన్న అడపాక రాంబాబు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా చేస్తున్నారు. అమ్మ గుణావతి గృహిణి. 9.37 సీజీపీఏ రావడంతో పాటు బంగారు పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. చదువుకునే సమయంలో పోలవరంలో ఇంటర్న్‌షిప్‌ చేశాను. డిజైన్‌ ఆఫ్‌ ఫ్లెక్సిబుల్‌ పేమెంట్‌పై ప్రాజెక్టు చేశాను. అధ్యాపకుల మన్ననలు అందుకున్నా. సివిల్‌ ఇంజినీర్‌ కావాలనేది లక్ష్యం. నోట్సు తయారు చేసుకుని ప్రణాళిక ప్రకారం చదవడం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం గుజరాత్‌లోని ఎల్‌అండ్‌టీలో ఉద్యోగం చేస్తున్నాను.

అడపాక ఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ దేదీప్య మౌనిక (సివిల్‌ ఇంజినీరింగ్‌)


ఏడు సంస్థల్లో ఎంపికయ్యా..

నాన్న శ్రీనివాసాచారి రాజాం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌, అమ్మ శారద గృహిణి. ద్వితీయ సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడ్డాం. విభాగాధిపతులు మాకు ఇబ్బందులు కలగకూడదని ఆన్‌లైన్‌లో బోధించారు. వెబ్‌ డెవలప్‌మెంట్‌ కమాండ్‌లో మంచి నైపుణ్యం పొందాను. అలాగే 9.17 సీజీపీఏ సాధించాను. దీంతో ఏడు సంస్థల్లో ఎంపికయ్యాను. హైదరాబాద్‌లోని యాక్సంచర్‌లో ఉద్యోగం చేస్తున్నా. పూర్తి నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం ఖాయం.

డి.బేబిప్రత్యూష (సీఎస్‌ఈ)


శాస్త్రవేత్తగా దేశానికి సేవ..

నాన్న శ్రీనివాసరావు వ్యాపారం చేస్తుంటారు. అమ్మ రాజ్యలక్ష్మి గృహిణి. 9.05 సాధించడంతో బంగారు పతకం అందుకోబోతున్నా. హైదరాబాద్‌లోని మిథానిలో రక్షణ విభాగానికి సంబంధించిన ప్రాజెక్టు చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఎంటెక్‌ చేస్తున్నా. శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయాలనేది నా లక్ష్యం. మన చదువే భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ప్రణాళికాయుతంగా చదివితే ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు.

బోళ్ల మల్లిక (మెటలర్జి ఇంజినీరింగ్‌)


ప్రణాళికతో చదవాలి..

నాన్న టి.అప్పారావు స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తారు. అమ్మ ప్రశాంతి విశ్రాంత ఉపాధ్యాయురాలు. 8.59 సీజీపీఏ సాధించాను. అందుకోసం సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడంతో పాటు గ్రంథాలయాల్లో పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఐఐఎంలో సీటు వచ్చింది. ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

టి.కారుణ్య (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని