logo

పవన్‌.. వారాహి విజయభేరి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

Published : 29 Mar 2024 03:17 IST

రేపు చేబ్రోలులో బహిరంగ సభకు ఏర్పాట్లు

పిఠాపురం, గొల్లప్రోలు, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30 నుంచి కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘వారాహి విజయభేరి’ పేరుతో బహిరంగసభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అనుమతుల కోసం జనసేన నేతలు ఆర్వోకు దరఖాస్తు చేయగా పోలీసులు స్థల పరిశీలన చేశారు. పార్టీ శ్రేణులకు అందిన సమాచారం ప్రకారం.. పవన్‌ శనివారం మంగళగిరి కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గొల్లప్రోలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ప్రైవేటు స్థలంలోని హెలిప్యాడ్‌ వద్ద మధ్యాహ్నం 12.30 గంటలకు దిగుతారు. అక్కడి నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి చేరుకుని వారాహికి పూజలు, పురూహుతిక అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని పొన్నాడలో ఉన్న బషీర్‌ బీబీ దర్గాను దర్శిస్తారు. తరువాత పిఠాపురంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం వద్ద ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభలో వారాహిపై నుంచి మాట్లాడతారు.  4.30 నుంచి 6.30 గంటల వరకూ జరిగే ఈ సభ కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతులు లభించాయి. ఆ స్థలాన్ని గురువారం రాత్రి శిక్షణ డీఎస్పీ ప్రమోద్‌, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌.. అంతకుముందు కాకినాడ పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని