logo

రామాపురంలో మళ్లీ వివాదం

వేటపాలెం మండలం రామాపురంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరువర్గాల ఘర్షణలో గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు మరో ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామాపురం మత్స్యకార గ్రామం.

Published : 01 Jun 2023 03:37 IST

గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ, మరో నలుగురు పోలీసులకు గాయాలు

గ్రామస్థులను వారిస్తున్న పోలీసులు

చీరాల అర్బన్‌, నేరవిభాగం, న్యూస్‌టుడే: వేటపాలెం మండలం రామాపురంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరువర్గాల ఘర్షణలో గ్రామస్థులతో పాటు చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు మరో ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రామాపురం మత్స్యకార గ్రామం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే గ్రామానికి చెందిన ఒకరు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు అతడ్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు గ్రామం నుంచి వచ్చేసి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాయి. దీనిపై ఈనెల 20న ఇరువర్గాలను కలిపేందుకు తీరప్రాంత పెద్దలు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కేసులు పెట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారం రోజులపాటు ఆగ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. తదనంతరం 24న పెద్దల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి అందర్నీ కలిపారు.

మాటామాట పెరిగి ఘర్షణ: బుధవారం సాయంత్రం చేతబడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వర్గానికి చెందిన వారికి గ్రామస్థుల మధ్య మాటామాట పెరిగింది. ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. విషయం తెలియడంతో చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని అప్పటికే పికెట్‌లో ఉన్న సిబ్బంది సాయంతో వివాదాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణలో సీఐతో పాటు నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. 85 కుటుంబాలకు చెందిన కాటంగారి మోహనర్రావు, కనకయ్య, చందు, సీతమ్మ, పండుస్వామితో పాటు మరికొందరికి దెబ్బలు తగలడంతో వీరందరూ చీరాల వైద్యశాలకు చికిత్స కోసం చేరుకున్నారు. ఘటనా స్థలానికి చీరాల డీఎస్పీ ప్రసాదరావు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడంతో పాటు గ్రామంలో తిరిగి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న చీరాల వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కరణం వెంకటేష్‌ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని