logo

ఎర్రరాయి.. యథేచ్ఛగా దందా..!

జిల్లాలో ఎర్రరాయి అక్రమ దందా ఊపందుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రభుత్వ భూముల్లో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు.

Published : 06 Feb 2023 00:52 IST

ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: జిల్లాలో ఎర్రరాయి అక్రమ దందా ఊపందుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రభుత్వ భూముల్లో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. రెండు నెలలుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ విమర్శలొస్తున్నాయి.  సరిహద్దుల్లోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఆక్రమించి ఈ దందాను దర్జాగా సాగిస్తున్నారు. మామూళ్ల వల్లే రెవెన్యూ సిబ్బంది పట్టనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


బీడుగా వదిలేయడమే అవకాశమైంది

పెద్దేముల్‌ మండలం పాషాపూరు రెవెన్యూ పరిధిలో 1,245 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్లో 500 మందికి పైగా గిరిజనులకు అసైన్డ్‌ చేశారు. 100 ఎకరాల వరకు ఎర్రమట్టి తవ్వకాల కు లీజుకు ఇచ్చారు. పాషాపూరు, ఊరేంటి తండా, అడ్కిచర్ల, ఓమ్లానాయక్‌ తండా, రాంసింగ్‌ తండాలకు చెందిన గిరిజనులు, దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారు. రాయి మాదిరిగా గట్టి నేల కావడంతో చాలా మంది వ్యవసాయం చేయక బీడుగా వదిలేశారు. ఇదే వ్యాపారులకు అవకాశంగా మారింది. పేదలకు ఎంతో కొంత ఇచ్చి భూముల్లో అక్రమంగా గనులను నిర్వహిస్తున్నారు.


అడ్డుకుంటే బెదిరిస్తున్నారు

స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వ్యాపారులు బెదిరింపులకు దిగుతున్నారు. అధికారులు రావడం లేదు. మీకేందుకు పట్టింపు అనే ధోరణితో  మాట్లాడుతున్నారని ఓ కింది స్థాయి అధికారి తెలిపారు. అక్రమాలకు రాజకీయ నాయకుల అండ ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు.  


ఇళ్ల నిర్మాణంలో వినియోగం

ప్రభుత్వ భూముల్లో యంత్రాలను తెచ్చి తవ్వేస్తున్నారు. మట్టిని తొలగించి ఎర్రరాయిని వెలికితీస్తున్నారు. అక్కడే తమకు కావాల్సి ఆకారంలో తీర్చిదిద్ది ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎర్రరాయికి మంచి గిరాకీ ఉండటంతో కర్ణాటక వ్యాపారులు సైతం మన భూముల్లోకి ప్రవేశించారు. సుమారు పదికి పైగా ప్రదేశాల్లో భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయి. దూరాభారం, రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో అధికారులు ఎవరూ అటు వైపు రావడం లేదు. అక్రమార్కులకు ఇది బాగా కలిసొచ్చింది. ఇదే అలుసుగా దందాను జోరుగా సాగిస్తున్నారు.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దారు, పెద్దేముల్‌

సరిహద్దుల్లో జరుపుతున్న తవ్వకాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు ఎవరైనా వదిలిపెట్టాం. సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఫోన్‌లో రికార్డు చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించాం. యంత్రాలు, వాహనాలను జప్తు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని