logo

‘గాంధీ’లో మురుగు సమస్యకు మోక్షం లేదా?

రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఒక్కటైన గాంధీలో మురుగు సమస్యకు మోక్షం లభించడం లేదు.

Published : 25 Mar 2023 02:32 IST

రూ.14 కోట్లతో టెండర్లు పిలిచినా ముందుకురాని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఒక్కటైన గాంధీలో మురుగు సమస్యకు మోక్షం లభించడం లేదు. నిత్యం వేలాది మంది రోగులు, వారి కుటుంబ సభ్యులు, సందర్శకులతో కిటకిటలాడే ఈ దవాఖానాలో కొంతకాలంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వెద్య ఆరోగ్య శాఖ ఆధునికీకరణ పనుల కోసం రూ.14 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మూడుసార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులపై సందిగ్ధత నెలకొంది. పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ కావడంతో ఎక్కడికక్కడ పైపులు పగిలిపోయి ప్రధాన భవనంలో సెల్లార్‌లోకి మురుగు చేరుతోంది. ఇక్కడే రోగుల కోసం ఆహారం తయారు చేస్తుంటారు. పక్కనే మురుగు నీళ్లు నిల్వ ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యుత్తు వ్యవస్థకు సంబంధించి పరికరాలు సెల్లార్‌లో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో 8 అంతస్తుల్లో 30 వరకు విభాగాలున్నాయి. అన్నిచోట్ల నుంచి మురుగు సెల్లార్‌కు చేరి అక్కడ నుంచి ప్రధాన వ్యవస్థలోకి కలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితం పైపులు కావడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. గాంధీ ఆసుపత్రి చుట్టూ భారీ స్థాయిలో నిర్మాణాలు రావడంతో చుట్టు పక్కల మురుగు వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది. తక్షణం గాంధీలో మురుగు నీటి వ్యవస్థను ఆధునికీకరించాలని  అధికారులు భావించారు. ఇప్పటివరకు ఆ పనుల టెండర్ల దశ దాటక పోవడంతో సమస్యకు మోక్షం లభించడం లేదు.

పంది కొక్కుల స్వైర విహారం...

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పందికొక్కులు, ఎలుకలు ఆసుపత్రి వార్డుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. పాత డ్రైనేజీ వ్యవస్థ కావడంతో పలుచోట్ల పైపులు శిథిలమయ్యాయి. వాటి నుంచి పందికొక్కులు, ఎలుకలు ఆసుపత్రిలోకి దూరుతున్నాయి. ఆరేడు నెలల క్రితం పందికొక్కులు పట్టే వారిని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో వెయ్యి వరకు ఎలుకలను పట్టి వాటిని సంహరించారు. తాజాగా వాటి బెడద పెరిగిందని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనిని ఆధునికీకరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ రూ.13 కోట్లు మంజూరు చేసింది. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో తొలుత దానిని సరిదిద్ది అనంతరం విద్యుత్తు వ్యవస్థను సరిదిద్దాలని అధికారులు భావించారు. పనులకు టెండర్లు పూర్తి కాకపోవడంతో చేసేది లేక.. ప్రస్తుతం విద్యుత్తు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని