Lakshman: రూ.లక్ష పేరుతో సీఎం కేసీఆర్‌ బీసీలను మోసం చేస్తున్నారు: లక్ష్మణ్‌

మంత్రి కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 07 Jun 2023 20:02 IST

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లక్షా 27వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న మంత్రి కేటీఆర్‌ .. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేశారు.. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. వందల ఎకరాల భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఎందుకు వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎందుకంత పారదర్శకత లేకుండా భయపడుతున్నారని నిలదీశారు.

ఇంటింటికీ ఫైబర్‌ కనెక్షన్‌ అన్నారు ఏమైంది? ఐదేళ్లయినా ఆ ఊసే లేదని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల గ్రామాల్లో ఉన్నట్టుగా కూడా ఇంటర్నెట్‌ తెలంగాణలో లేదని  ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు కూడా గుజరాత్‌ నుంచి తెప్పించారని, ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. మోదీ సర్కారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించింది.. మీరేం చేశారో చెప్పాలని భారాస నేతలకు సవాల్‌ విసిరారు. ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారు.. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న అంశాలపై దమ్ముంటే శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే తెలంగాణకు మరింత మేలు జరుగుతుందన్నారు. బీసీల ఫెడరేషన్‌కు డబ్బులేదు, కార్పొరేషన్‌కు నిధుల్లేవు కానీ, ఇప్పుడు లక్షరూపాయల పేరుతో కేసీఆర్‌ మోసం చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని