logo

కానిస్టేబుల్‌నంటూ వసూళ్లు

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల యజమానుల ఫోన్‌ నంబర్లు సేకరించి, తాను కానిస్టేబుల్‌నంటూ వారి నుంచి నగదు డిమాండ్‌ చేస్తున్న వ్యక్తి గురించి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

Updated : 07 Dec 2022 06:36 IST

ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లే లక్ష్యం

ముదిగొండ, న్యూస్‌టుడే: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల యజమానుల ఫోన్‌ నంబర్లు సేకరించి, తాను కానిస్టేబుల్‌నంటూ వారి నుంచి నగదు డిమాండ్‌ చేస్తున్న వ్యక్తి గురించి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ముదిగొండలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణ యజమానికి ఈ నెల 4న ఓ వ్యక్తి కానిస్టేబుల్‌ను అంటూ ఫోన్‌ చేశాడు. మీ దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. ఈ నెల 2న సూర్యాపేటకు చెందిన వారు మూడు ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ పార్సిల్‌ తీసుకువెళ్లారని అవి తినడంతో ఒక బాలుడికి ఫుడ్‌ పాయిజన్‌ అయిందని చెప్పాడు. విషయం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, పోలీసులకు తెలిస్తే కేసులు అవుతాయని బెదిరించాడు. వాళ్లతో మాట్లాడి సెటిల్‌ చేస్తానని తనకు రూ.2 వేలు ఇవ్వాలని దుకాణ యజమానికి ఫోన్‌లో డిమాండ్‌ చేశాడు. దుకాణ యజమాని గట్టిగా ప్రశ్నించడంతో సదరు వ్యక్తి ఫోన్‌ కట్ చేశాడు. ఇటీవల ఖమ్మంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమానికి సైతం ఇదే తరహాలో ఫోన్‌ చేసి కొంత మొత్తంలో నగదు తీసుకున్నట్లు తెలిసింది. ఎస్‌బీ అధికారులు మంగళవారం ముదిగొండలో ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రం యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఫోన్‌ చేసిన వ్యక్తి సైబర్‌ నేరగాడా? పోలీస్‌ కానిస్టేబులా అనేది పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తే తెలిసే అవకాశం ఉంది.

డెంగీతో బాలుని మృతి

పాల్వంచ (జగన్నాథపురం), న్యూస్‌టుడే: నాగారం కాలనీకి చెందిన ఓ బాలుడు(6) డెంగీతో పోరాడుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బాలునికి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించారు. ఆదివారం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం ఖమ్మం తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల క్రితమే పెద్ద కుమారుడు చనిపోయిన బాధను మరిచిపోకముందే మరో కుమారుణ్ని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమారుడు లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వారు రోదిస్తున్న తీరు పలువురిని కదిలించింది.

మాయమాటలతో పాస్టర్‌ ప్రేమాయణం!

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్‌ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో మొదలైన పాస్టర్‌ వ్యవహారం.. ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా తలెత్తిన వివాదానికి గన్నవరంలో అడ్డుకట్ట పడింది. పోలీసుల, బాధితుల కథనం ప్రకారం.. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన కల్యాణి నాగేశ్వరరావు.. ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీఆర్‌ కాలనీలో చర్చి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం స్థానికంగా చర్చి ఏర్పాటు చేసిన అతనికి అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆరోగ్యం బాగాలేదని ఓసారి పాస్టర్‌ వద్దకు సదరు బాలిక వెళ్లింది. ప్రత్యేక ప్రార్థన చేస్తే తగ్గిపోతుందంటూ ఆమెకు దగ్గరయ్యాడు. పాస్టర్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు గన్నవరం మండలం ముస్తాబాదలోని బంధువుల ఇంటికి ఆమెను పంపించారు. ఈ నెల 2న సదరు బాలిక బంధువుల ఇంటినుంచి అదృశ్యం కావటంతో గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలిక పాస్టర్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రార్థÄనల నిమిత్తం మాత్రమే తాము వెళ్లినట్లు బాలిక, పాస్టర్‌ చెబుతున్నారని సీఐ సత్యనారాయణ తెలిపారు. మరోవైపు అనారోగ్య కారణాలతో భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న నాగేశ్వరరావు.. మాయమాటలతో తమ కూతుర్ని ఎత్తుకెళ్లి వేధిస్తున్నాడని, పొక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆలయ భూముల ఆక్రమణపై ఫిర్యాదు

భద్రాచలం, న్యూస్‌టుడే: పురుషోత్తపట్నంలోని భద్రాచలం ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదని ఎటపాక అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గోశాల సమీపంలో పదుల సంఖ్యలో కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. తాత్కాలిక ఆవాసాల స్థానంలో శాశ్వతంగా ఉండేందుకు గృహాలను నిర్మిస్తున్నారు. జగదీశ్‌కాలనీ శివారులోను ఇదే తరహాలో దేవుడి మాన్యాన్ని సొంతానికి వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించినా రామాలయం సిబ్బంది సరైన విధంగా స్పందించకపోవడంతో ఆక్రమణలు ఆగడం లేదని భావిస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవుడి జాగా వివాదాల్లో ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇటువైపు తిరిగి చూడకపోవడం ఈ శాఖ తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని భక్తులు అంటున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని